తనిష్క్: కిరణ్ లొంగుబాటు, చోరీ లెక్కలపై తలోమాట!
మానసిక సమస్య కారణంగా ఆ వ్యక్తి అలా చెప్పాడా? అతని మాటలు ఎంత వరకు నమ్మవచ్చుననే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. దోచుకున్న సొత్తును దాచిపెట్టిన ప్రాంతాన్ని చూపిస్తానని కూడా పోలీసులను వెంట బెట్టుకొని వెళ్లాడు. అక్కడ అతను దాచిపెట్టిన మొత్తాన్ని చూపించడంతో.. కిరణ్ ఒక్కడే ఇది చేశారా, అతని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కిరణ్ తల్లి కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లుగా సమాచారం. తాను సంచలనం కోసమే దొంగతనం చేసినట్లు కిరణ్ చెప్పాడు.
మరోవైపు తనిష్క్ భారీ దోపిడీపై పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. షాపు ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా రూ.23 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ జరగలేదని తేలిందని సమాచారం. వాస్తవానికి చోరీకి గురైన మొత్తం రూ.5.98 కోట్లకు మించి ఉండదని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
రూ.11 కోట్ల విలువ చేసే 18 కిలోల ప్లెయిన్, బంగారు ఆభరణాలు, రంగు రాళ్లు, ముత్యాలు పొదిగిన 12 కోట్ల విలువైన 12 కిలోల ఆభరణాలు చోరీకి గురైనట్లుగా దుకాణం ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాని అసలు 15 కిలోల బంగారం, కిలో రంగురాళ్లు మాత్రమే చోరీకి గురయ్యాయని పోలీసుల దర్యాప్తులో తేలిందట. దీంతో తప్పుడు వివరాలు అందించిన తనిష్క్ ప్రతినిధులపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
సిసి కెమెరా చిత్రాల ద్వారా కేసు విచారణ చేపట్టిన సిసిఎస్ పోలీసులు దొంగలకు సంబంధించి పలు కీలక విషయాలు కనుగొన్నారు. దుండగుడికి పోలియో ఉన్నట్లు, అతడి కుడి చేయి, కుడి కాలుకు వైకల్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 9 అంగుళాల మందం ఉన్న గోడకు 1.5 అడుగుల ఎత్తు, అడుగు వెడల్పుతో రంధ్రం చేసిన దుండగుడు తల, ఆ తర్వాత చేతులు లోనికి పెట్టి చొరబడినట్లు సిసి కెమెరా ఆధారంగా గుర్తించారు.
లోనికి ప్రవేశించగానే షాపులోని లైట్లు ఆర్పి, టార్చిలైట్తో దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. షాపు ముందు, వెనకాల కూడా సిసి కెమెరాలు లేకపోవడంతో చోరీలో ఎంత మంది పాల్గొన్నారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చోరీలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు సిసిఎస్ పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. చోరీ జరిగిన రోజు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. కాని వారు రాత్రి సెల్లార్లోని గదిలో నిద్రించారు.
ఈ సమయంలోనే దొంగలు చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. షాపు వెనకాలున్న సందులో గడ్డపారలు పట్టే స్థలం లేనందున దొంగలు డ్రిల్ మిషన్ ద్వారా గోడకు రంధ్రం చేసినట్లు అనుమానిస్తున్నారు. డ్రిల్ మిషన్తో రంధ్రాలు చేస్తున్నప్పుడు వచ్చే శబ్దాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై సిసిఎస్ పోలీసులు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది.