నారా లోకేష్ను సిఎం చేసేందకే..: తాంత్రిక పూజలపై అంబటి
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు, మంత్రి నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేందుకే దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఆరోపించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవి గుడిలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారంపై సిట్టింగ్ జడ్డిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
ఇలా ఆరోపణలు వచ్చాయి..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబంపై తాంత్రిక పూజలు చేయించారనే ఆరోపణలు వచ్చాయని అంబటి రాంబాబు అన్నారు. శ్రీకాళహస్తిలో క్షుద్రపూజలు కూడా చేయించారని ఆరోపణలు విస్తుపోయేలా చేశాయని చెప్పారు.
ప్రముఖ దేవాలయాల్లో పూజలు..
రాష్ట్రంలోని అనేక ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ పూజలు జరిగాయన్న ఆరోపణలు వినవస్తున్నాయని అంబటి రాంబాబు అన్నారు. తాంత్రికపూజలపై నిజనిర్దారణ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని ఆరోపించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ...
దుర్గగుడిలో పూజలపై సిట్టింగ్ జడ్డితో ఈ వ్యవహారంపై విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగుచూస్తాయని అంబటి రాంబాబు అన్నారు.ప్రభుత్వం వేసిన కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని అభిప్రాయపడ్డారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కుటుంబమే తాంత్రిక, క్షుద్ర పూజలు చేయించడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.
తూతూ మంత్రంగా చేస్తే..
కనక దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారంపై విచారణ మాత్రం తూతూ మంత్రంగా సాగుతోందని అంబటి రాంబాబు అన్నారు. దోషులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.