లోకేశ్ను సీఎం చేసేందుకే దుర్గగుడిలో తాంత్రిక పూజలు: అంబటి రాంబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ను సీఎంను చేసేందుకే దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.
మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారన్నారు. పూజ చేస్తూ దొరికిపోయిన తరువాత ఆ తప్పును అధికారులపైకి నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఒక్క చంద్రబాబు కుటుంబానికే...
ఆంగ్ల సంవత్సరం సందర్భంగా జనవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు జరగలేదని, కానీ చంద్రబాబు కుటుంబాన్ని మాత్రం వేద పండితులు ఆశీర్వదించారని రాంబాబు వ్యాఖ్యానించారు.
అసలు చంద్రబాబుకు మతి స్థిమితం ఉందా?
కొత్త ఏడాది సందర్భంగా మద్యం దుకాణాలకు నిబంధనల సడలింపు ఇవ్వడంపై కూడా అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మతిస్థిమితం ఉందా? అనే అనుమానం కలుగుతుందన్నారు.
టీడీపీకి ఓట్లు ఎందుకేయాలి?
అసలు తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు ఎందుకేయాలో చెప్పాలంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించినందుకా? లేకపోతే 600 వాగ్దానాలు చేసి వాటిలో పట్టుమని పది వాగ్దానాలు కూడా నిలుపుకోలేకపోయినందుకా? అంటూ రాంబాబు నిప్పులు చెరిగారు. పారిశ్రామిక సదస్సుల పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, వాటి వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు.
తాంత్రిక పూజలు అవాస్తవం...
విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ స్పష్టం చేశారు. శ్రీచక్రం గుడిలో ఉండగా ఇలాంటి పూజలు జరగవన్నారు. ఈ విషయమై ఆలయ ఈవో సూర్యకుమారికి ఓ లేఖ కూడా రాసినట్లు బద్రీనాథ్ వివరించారు. గర్భగుడిలో పురుగులు చేరడంతో శుద్ధి కార్యక్రమం చేపట్టామని, ఇందులో సహాయం కోసం విశ్వనాథపల్లి ఆలయ అర్చకుడు రాజాను తీసుకొచ్చామని ఆయన తెలిపారు.