సంచలనం: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు?
విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు జరుగుతున్నాయా? ఆలయాన్ని మూసివేశాక అర్ధ రాత్రి సమయంలో రహస్యంగా అగంతకులు ఈ పూజలు నిర్వహిస్తున్నారా? అదే నిజమైతే ఎవరు ఈ పూజలు చేయిస్తున్నారు? ఎవరికోసం చేయిస్తున్నారనే ప్రశ్నలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అర్ధ రాత్రి జరుగుతున్న రహస్య పూజలు పెను దుమారం రేపుతున్నాయి. మొదట కేవలం వీటిని పుకార్లుగా భావించిన భక్తులు ఆ తరువాత ఇలా పూజలు జరగడం నిజమేనని తెలిసి నివ్వెరపోతున్నారు. ఈ రహస్య పూజల గురించి ఆలస్యంగా వెలుగుచూడగా, డిసెంబరు 26 అర్ధరాత్రి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అగంతక పూజారి సిసి కెమేరాకు చిక్కడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు దుర్గ గుడిలో ఈ ప్రత్యేక పూజలపై ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
అర్థరాత్రి పూజలకు అనుమతి లేదు...
దేవాలయాలల్లో వాస్తవంగా అర్ధరాత్రి పూజలకు, అర్చనలకు అనుమతి వుండదు. విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని రాత్రి 9 గంటలకే మూసివేస్తారు. అయితే దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఆచారానికి విరుద్ధంగా అర్థరాత్రి పూజలు నిర్వహించడంపై అనుమానాలు రేకెత్తించాయి.
డిసెంబర్ 26 న ఏం జరిగింది...
దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరుగుతున్నట్లు ఒక ఛానెల్ లో కథనాలు వెలువడటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26 వ తేదీన అర్ధరాత్రి అంతరాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమేరాలో రికార్డయినట్లు తెలుస్తోంది. పైగా అక్కడ పూజలు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి దేవాస్థానానికి చెందిన అర్చకుడు కాడని, కాషాయ వస్ర్తాలు వేసుకున్నఅగంతకుడని, దేవస్థానానికి సంబంధించిన వ్యక్తి కాదని నిర్ధారించారు. దీంతో ఈ పూజల వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. నిజానికి ఇలాంటి ఘటన జరిగితే దేవస్థానం అధికారులే ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడమో, లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడమో జరగాలి. అయితే అటువంటిదేమీ జరగకపోవటం అనుమానాలను మరింత బలపరుస్తోంది.
ఆ సమయంలో అలంకరణలు...పూజలంటే...
దుర్గ గుడిని రాత్రి 9 గంటలకు మూసివేసి అనంతరం తెల్లవారుజాము 3 గంటలకు తెరవాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా డిసెంబర్ 26వతేదీన అర్ధరాత్రి 11 గంటల వరకు ఆలయాన్ని తెరిచిఉంచడమే కాకుండా అమ్మవారికి ప్రత్యేక అలంకార కార్యక్రమాలను నిర్వహించినట్టు చెబుతున్నారు. ఆ తరువాత అర్ధరాత్రి 12.45 గంటల వరకు పూజలు నిర్వహించినట్టుగా నిర్థారణ జరిగింది. అయితే దేవస్థానం అధికారులకు తెలియకుండా అంతరాలయం తలుపులు తీయడం అనేది సాధ్యంకాదు. అయితే అధికారులు మాత్రం ఆలయం శుభ్రం చేయడానికి ఇద్దరు అర్చకులకు అనుమతి ఇచ్చామని వివాదం నెలకొన్నాక చెబుతున్నారు. మరోవైపు ఈవో సూర్యకుమారి ఈ వివాదంపై విచారణ చేయిస్తామని తేల్చేసినట్టుగా తెలిసింది.
గతంలో ఒకసారి...ఇలాగే...
ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడి కటకటాలు లెక్కిస్తున్న దేవాదాయశాఖ రీజినల్ కమిషనర్ అజాద్ ఇక్కడ ఈవోగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. దానికి అప్పుడు ఆజాద్ ఆలయంలో మరమ్మత్తుల కోసం వాళ్లని రప్పించినట్లు బుకాయించారు.ఇప్పుడు కూడా ఇలాగే అర్చకులకు తెలియకుండా అధికారుల తోడ్పాటుతో ఈ పూజలు జరుగుతుండటం గమనార్హం.
జోరుగా ఊహాగానాలు...
విజయవాడ కనకదుర్గ ఆలయంలో జరుగుతున్నవి తాంత్రిక పూజలని, అర్థ రాత్రి సమయంలో జరిగే పూజలు అవేనని కొందరు భక్తులు నొక్కివక్కాణిస్తున్నారు. మరోవైపు ఇలా ఈ తాంత్రిక పూజలు డిసెంబర్ 8 వ తేదీ నుంచి జరుగుతున్నాయని, ఈ పూజలు నిర్వహిస్తున్న వాళ్లు తమిళనాడుకు చెందినవారని అర్చకుల్లో కొందరు చెబుతున్నారు. వీరంతా తాంత్రిక పూజలు నిర్వహించేందుకే ఇక్కడకు వచ్చారని, వీరిలో ముగ్గురు ప్రధాన పూజారులు కాగా ఇద్దరు వారికి అసిస్టెంట్లని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంతో అర్చకులకు సంబంధం లేదని, అధికారుల సహకారంతోనే ఈ పూజలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎవరికోసం...ఎందుకోసం...
ఇలా కనకదుర్గమ్మకు మహిషాసురమర్ధిని సమయంలో కాళికామాతగా అవతరించే ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించడం అంటే ఖచ్చితంగా తాంత్రిక పూజల కోసమేనని పూజారులు అంటున్నారు. అయితే ఈ పూజలు ఎవరికోసం, ఎందుకోసం నిర్వహించారనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అధికారుల తోడ్పాటుతో పూజలు జరిగాయంటే సమస్యల నివారణ కోసం ప్రభుత్వంలో ముఖ్యుల కోసమో, అధికారుల కోసమే అయివుంటుందనేది ఒక వాదన. అయితే పూజలు నిర్వహిస్తోంది తమిళనాడు పూజారులు కాబట్టి అక్కడి పరిణామాల నేపథ్యంలో ఇక్కడి అమ్మవారి మహిమ దృష్ట్యా ఇక్కడి కొచ్చి పూజలు నిర్వహిస్తున్నారనేది మరో వాదన.అయితే ఇవన్నీ ఊహాగానాలే. నిజమేమిటనేది పోలీసులు చిత్తశుద్దితో ప్రయత్నించి సమగ్ర విచారణ జరిపితే బైటపడే అవకాశం ఉంది.