ఆ మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది- మెగాస్టార్..!!
తీవ్ర గుండెపోటుతో బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
బెంగళూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అత్యాధునిక చికిత్సను అందిస్తోన్నారు.
నందమూరి కుటుంబం మొత్తం ప్రస్తుతం నారాయణ హృదయాలయా ఆసుపత్రిలోనే ఉంటోన్నారు. తారకరత్న తండ్రి మోహన కృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. తారక్ కు అందుతోన్న వైద్య సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారు. ఆయనను చూడ్డానికి హైదరాబాద్ నుంచి పలువురు తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు బెంగళూరుకు వస్తోన్నారు.
ప్రముఖ నటులు, తారకరత్న సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, శాండల్ వుడ్ సూపర్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, మంచు మనోజ్.. తదితరులు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అటు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ కూడా తారకరత్న ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నారు.
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందంటూ ఆయన కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారు. ఎక్మో సపోర్ట్ తో తారక్ కు వైద్యాన్ని అందిస్తోన్నారంటూ వచ్చిన వార్తలను నందమూరి రామకృష్ణ కొట్టి పారేశారు. అలాంటిదేమీ లేదని చెప్పారు. డాక్టర్లు అందించే వైద్యానికి ఆయన శరీరం సహకరిస్తోందని అన్నారు. పూర్తిస్థాయిలో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తారకరత్నకు ఇంకా వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తోన్నారని వివరించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి- స్పందించారు. నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. తారకరత్న త్వరగా కోలుకుంటున్నారని, ఇక ఏ ప్రమాదం లేదనే మాట తనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని చిరంజీవి చెప్పారు. తారక్ త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుంచి ఆయనను కాపాడిన ఆ డాక్టర్లు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిరంజీవి చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన.