చంద్రబాబు 'టార్గెట్-2018' : ఊపందుకోనున్న అమరావతి సెకండ్ ఇన్నింగ్స్
అమరావతి : నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకుంటోంది. తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తయిపోవడంతో.. ఇక శాశ్వత భవనాలు, మౌళిక సదుపాయాల కల్పనపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. టార్గెట్-2018 పేరిట ఈ పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే అధికారులకు జారీ చేసిన ప్రభుత్వం.. వేగంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదే విషయంపై ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో చర్చించారు చంద్రబాబు. ఈ నెల అమరావతి శాశ్వత నిర్మాణాల పనులకు శంకుస్థాపన జరగనుండగా.. శంకుస్థాపన నాటి నుంచి శరవేగంగా పనులు చేపట్టి 2018నాటికి అన్ని వసతులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
ఇక బౌద్దక్షేత్రంగా పేరుగాంచిన అమరావతిలో బుద్దుడి విగ్రహ ప్రతిష్ఠాపన చేయనుంది ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజీ ఇవతలి కొండపై ఉన్న కనకదుర్గమ్మ ఉన్నందునా.. అవతలి కొండపై బుద్ధుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలియవస్తోంది. ఇస్కాన్ కృష్ణుడి మందిరాలతో పాటు చర్చి, మసీదుల నిర్మాణాలను కూడా ప్రభుత్వం చేపట్టనుంది. అమరావతిలో నిర్మించే ప్రతీ కట్టడంలోను ఏపీకి సంబంధించిన కళలు, బౌద్ద సంస్కృతులు ప్రతిబింబించేలా.. అన్నీ ఏకరూపతను సంతరించుకునేలా ఉండాలని అధికారులకు చెప్పినట్లు సమాచారం.