రాజ్యసభకు చిరంజీవి ..!! సీఎం జగన్ మెగా స్ట్రాటజీ : ప్లాన్ వర్కౌట్ అయితే ఆ నలుగురికే...!!
వైసీపీ నుండి రాజ్యసభకు ఎంపికయ్యేది ఎవరు. ఇంకా సమయం ఉన్నా..వైసీపీలో మాత్రం పక్కా వ్యూహాత్మకంగా నామినేటెడ్ పదవుల నుండి రాజ్యసభ అభ్యర్దుల వరకు ఎంపిక చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో పెండింగ్ ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ కసరత్తు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక, ఈ నెలలో ఎమ్మెల్యే కోటాలో మూడు... స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. మూడు స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం అనుమతి రాగానే పూర్తి చేయనున్నారు.
Recommended Video
స్థానిక సంస్థల కోటాలో భర్తీ విషయంలో ఈ మధ్య కాలంలో జరిగిన పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. దీని పైన న్యాయ పోరాటం..లేదా తిరిగి ఎన్నికలు నిర్వహిస్తేనే వాటి భర్తీ సాధ్యమవుతుంది. ఇక, మరో మూడు నెలల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంది. అందులో ఎవరు ఔట్..ఎవరు ఇన్ అనేది పూర్తిగా సామాజిక సమీకరణాలు- ప్రాంతాల కు అనుగుణంగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటుగా రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు.
రాజ్యసభకు వైసీపీ నుండి నలుగురు..
వచ్చే జూన్ లో నాలుగు స్థానాలు ఏపీ నుండి ఖాళీ కానున్నాయి. అందులో విజయ సాయి రెడ్డి పదవీ కాలం సైతం వచ్చే జూన్ 21న ముగుస్తుంది. ఆయనకు మరో టర్మ్ పొడిగింపు ఖాయమే. వైసీపీ నుండి రాజ్యసభ ఆశిస్తున్న వారు ఉన్నారు. కానీ, పెద్దల సభకు వెళ్లాలనుకున్న ఆశవాహులకు రాష్ట్ర స్థాయిలో సర్దుబాటు చేయాలనేది ఇప్పుడు వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. టార్గెట్ 2024 లో భాగంగా ప్రతీ ఎంపిక సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా ఎంపిక చేస్తున్నారు. అదే కొనసాగించనున్నారు. విజయ సాయి రెడ్డితో పాటుగా టీడీపీ నుండి బీజేపీలో చేరిన సుజనా చౌదరి..టీజీ వెంకటేష్ రాజ్యసభ పదవీ కాలం సైతం విజయ సాయిరెడ్డితో పాటుగానే ముగియనుంది. వారికి..బీజేపీ ఇతర రాష్ట్రాల నుండి రెన్యువల్ చేస్తుందా అనేది సందేహమే. ఇక, బీజేపీకే చెందిన సురేష్ ప్రభు సైతం పదవీ విరమణ చేయనున్నారు. అయితే, వైసీపీ నుండి సాయిరెడ్డి స్థానం రెన్యువల్ అయినా..మిగిలిన మూడు స్థానాలు ఇప్పటికే రిజర్వ్ అయిపోయినట్లు పార్టీ ముఖ్యుల్లో ప్రచారం సాగుతోంది. అందులో ఒకటి ఇప్పటికే ప్రచారం సాగుతున్న విధంగా పారిశ్రామిక వేత్త ఆదానీ పేరు ఖాయమని చెబుతున్నారు.
తెర పైకి కిషోర్ రావు.. చిరంజీవి..
రెండో పేరు సైతం బీజేపీ పెద్దల అభ్యర్దన మేరకు గతంలో మోదీ గుజరాత్ లో పని చేసిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ఐఏస్ అధికారి కిషోర్ రావు పేరుకు సైతం అంగీకారం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఆ పేరు విషయంలో ఇప్పటికైతే అనుకూలంగానే ఉన్నా..చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఆయనకు వైసీపీ నుండే ఖాయమని తెలుస్తోంది. ఇక, అనూహ్యంగా వైసీపీలో ప్రచారం జరుగుతున్న మరో పేరు మెగాస్టార్ చిరంజీవి. ఏపీలో బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వర్గాలు పూర్తిగా వైసీపీకే అనుకూలంగా ఉన్నాయనేది పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీసీలకు మరింత ప్రాధాన్యత రానున్న రోజుల్లో దక్కనున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఇక, రెడ్డి వర్గం వైసీపీ వైపే ఉంటుందని అంచనా. రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి కాపు వర్గం కీలకం కానుంది. బీజేపీ ఏపీలో ఈ ఫ్యాక్టర్ ద్వారానే ఎదగాలని ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం సోము వీర్రాజు కు పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా..మిత్రపక్షంగా జనసేనతో చేతులు కలిపింది. రానున్న రోజుల్లో పవన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది.
చిరంజీవిని ఒప్పించి కొత్త సమీకరణాలతో..
ఈ క్రమంలో కాపు వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు తన పాలనలో మూడో ఏట ప్రవేశించిన సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. గతంలో తన తండ్రితో...ఇప్పుడు తనతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవికి తన పార్టీ నుండి రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చిరంజీవి ఇప్పటికే రెండు సార్లు అమరావతి వెళ్లి కలిసారు. సినిమా పరిశ్రమ సమస్యల విషయంలో చిరంజీవి లీడ్ తీసుకోవాలని..తాను తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు.. కాంగ్రెస్ లో విలీనం..కేంద్ర మంత్రిగా పని చేసిన తరువాత చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తిరిగి సినిమాల పైనే ఫోకస్ పెట్టారు. కరోనా వేళ సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, చిరంజీవిని తమ పార్టీ నుండి రాజ్యసభకు పంపిస్తే కాపు ఈక్వేషన్ పక్కగా వర్కవుట్ అవుతుందని వైసీపీ అంచనా. ఇందుకు చిరంజీవిని ఖచ్చితంగా ఒప్పిస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.
ప్లాన్ వర్కవుట్ అయితే...మెగా సక్సెస్..
పార్టీలో కీలక వ్యక్తుల మధ్య జరుగుతున్న ఈ చర్చ లో చిరంజీవి ఇప్పటికే రాజ్యసభ..కేంద్ర మంత్రి పదవులు చేసి ఉన్నారని..ఇప్పుడు వైసీపీ నుండి తిరిగి ఆ హోదా పొందుతారా అనేది తేలాల్సి ఉంది. నిజంగా వైసీపీ చెబుతున్న విధంగా చిరంజీవిని ఒప్పించి..రాజ్యసభకు పంపగలిగితే..బీజేపీ కాపు ఫ్యాక్టర్ లెక్కలు తల కిందులవుతాయని.. బీజేపీతో జాతీయ స్థాయిలో మైత్రి కొనసాగిస్తున్నా... రాష్ట్రంలో మాత్రం కాషాయం పార్టీ ఎదుగుదలకు అవకాశం ఇవ్వకూడదనేది వైసీపీ అంతర్గత వ్యూహం. ఇక, టీడీపీకి అన్ని వర్గాలు దూరం అవుతున్నాయని..ఎన్నికల్లోగా తిరిగి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వారిని దగ్గర చేసుకోవటం సాధ్యం కాదనేది వైసీపీ నేతల అంచనా. దీంతో..చిరంజీవి కోసం వైసీపీ వేస్తున్న మెగా ప్లాన్ వర్కవుట్ అవుతే..ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. భారీ మార్పులు చేసుకోవటం ఖాయం.