టార్గెట్ బీజేపి..! మమతాతో బాబు భేటీ..! జాతీయ మహాకూటమికి శ్రీకారం..!!
హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త ఫ్రంట్ కు రూపకల్పన జరుగుతోంది. యూపీఏ స్థానంలో కొత్తగా సేవ్ నేషన్ కూటమి వస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారు. ఆయన ఢిల్లీలో జరిపిన సమావేశాల్లో దాదాపుగా బీజేపీకి దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలందరూ హాజరయ్యారు. దీంతో.. టీడీపీ నేతలు, బీజేపీని గద్దె దించే కూటమికి చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారని చెబుతున్నారు. అయితే అది అంత సాధ్యమవుతుందా అన్న అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అంతే కాకుండా కాంగ్రెస్ తో టీడిపి పొత్తు అంశం పట్ల కూడా విస్త్రుత స్థాయిలో చర్చ జరుగుతోంది.
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి..! అందుకే దేశ నేతలతో చంద్రబాబు మంతనాలు..!
బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ జాతీయ స్థాయిలో ‘మహా కూటమి' ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పార్టీలను ఒక్కటి చేసే ప్రక్రియ మరో దశకు చేరుకుంది. ‘దేశాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి' నినాదంతో ఈ వేదిక రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య ఉన్న విభేదాలు, గతంలోని వైరుధ్యాలను మరచిపోయి కలిసిపనిచేయాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఎవరు ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి... అనే అనిశ్చితిని తొలగిస్తూ చంద్రబాబు తీసుకున్న చొరవ జాతీయ స్థాయిలో ఫలితం చూపుతోంది. కాంగ్రె్సతోసహా 15 పార్టీలతో జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.
మోదీ వర్సెస్ చంద్రబాబు..! జాతీయ నేతల ఏకాభిప్రాయం కోసం బాబు ప్రయత్నాలు..!!
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ఇటీవల రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్న బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, నిన్న చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ చర్చల ద్వారా తన ప్రయత్నాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా చంద్రబాబుతో అశోక్ గెహ్లాట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్బోదిస్తున్నారు. సేవ్ నేషన్ .. సెవ్ డెమోక్రసీ నినాదంతో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. నల్లధనం నియంత్రణకు పెద్ద నోట్ల రద్దు చేయలేదని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వం ఎప్పుడూ రాలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ గెహ్లాట్ విమర్శించారు. 22న బీజేపీయేతర పక్షాల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న బాబు..! బీజేపి ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపణ..!!
గత నెలలో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎన్సీ నేత ఫరూక్ అబ్దుల్లా, ఆప్ నేత కేజ్రీవాల్, సీపీఐ నేత రాజా, సురవరం సుధాకర్ రెడ్డిలను కలిశారు. గురువారం ఆయన మళ్లీ ఢిల్లీకి వచ్చారు. తొలుత శరద్ పవార్ నివాసంలో విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీకి ఫరూక్ అబ్దుల్లా కూడా హాజరయ్యారు. ‘దేశంలోని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న మోదీకి వ్యతిరేకంగా బలమైన కూటమిగా ఏర్పడటం అనివార్యం' అని ఫరూక్, పవార్ స్పష్టంగా చెప్పారు.
మమతా తో చంద్రబాబు భేటీ..! జాతీయ స్థాయిలో ప్రాధాన్యత..!!
దేశంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్న ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు ఈనెల 19న చంద్రబాబు నాయుడు కోల్ కతా వెళ్లనున్నారు. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో భేటీ కానున్నారు. బీజేపీయేతర పార్టీలతో భేటీ లో భాగంగా మమతతో కలువనున్నారు. ఈ నెల 22 న ఢిల్లీలో కొత్త కూటమి ఏర్పాటు, కార్యాచరణపై సమావేశం ఉన్నందున ఈ లోపే మమతతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమార స్వామి, సమాజ్ వాదీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, శరద్ పవార్, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తో చంద్రబాబు సమావేశమై చర్చించారు.