క్విట్ జగన్ -కేంద్రంతో సంబంధాలు : తిరిగి అధికారం ఖాయం - టీడీపీ రాజకీయ తీర్మానం..!!
ఏపీలో రానున్న ఎన్నికల్లో పొత్తుల అంశం పైన చర్చ సాగుతోంది. మహానాడు వేదికగా టీడీపీ ఈ అంశం పైన క్లారిటీ ఇస్తుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే, టీడీపీ రాజకీయ తీర్మానంలో మాత్రం ఎక్కడా స్పష్టంగా పొత్తుల అంశం ప్రస్తావనకు రాలేదు. ఎన్నికలకు సమయం ఉండటంతో...ముందుగానే తీర్మానం ద్వారా ఆ అంశం పైన స్పందించి..వైసీపీకి అవకాశం ఇవ్వకూడదనే టీడీపీ నేతలకు పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
దీంతో..రాజకీయ తీర్మానం బాధ్యత పార్టీ సీనియర్లు యనమల - రావుల చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. ఏపీ రాజకీయాలతో పాటుగా..వ్యూహాత్మకంగా ఇందులో కేంద్రం - రాష్ట్రాల మధ్య సంబంధాల పైన ప్రస్తావన చేసారు.
ప్రభుత్వ అక్రమాలపై ఉద్యమాలు
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని తీర్మానంలో పిలుపునిచ్చారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా దీటుగా ఎదుర్కొని విజయం సాధించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సహకార ధోరణి ఉండాలి. ఏ విధమైన పొరపచ్చాలూ లేకుండా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కలిసి పని చేయాలని తీర్మానం చేసారు.
జాతీయ రాజకీయాల్లో భాగంగా బీజేపీ - టీడీపీ మధ్య గ్యాప్ ఉంది. అదే సమయంలో కేసీఆర్ తో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. దీంతో..వ్యూహాత్మకంగానే ఈ తీర్మానం చేసినట్లుగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వ అవినీతి, అసమర్థ, నిరంకుశ పాలనతో రాష్ట్ర భవిష్యత్ అంధకారమైందని ఆవేదన వ్యక్తంచేసింది.
అధికారంలోకి రావటం ఖాయమంటూ
ఈ విపత్కర పరిస్థితుల్లో టీడీపీని అధికారంలోకి తేవడానికి, రాష్ట్ర భవిష్యత్ కోసం అందరం నడుం కట్టాలని పేర్కొంది. రాష్ట్రాన్ని పాలించేవారు అసమర్థులు, అవినీతిపరులు, ఆర్థిక నేరస్థులైతే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో.. రాష్ట్రం ఎలా నష్టపోతుందో ప్రజలందరికీ వివరించాలని సూచించింది. ఎన్టీఆర్ ఆశయాలను నిజం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలి.
తెలుగుదేశం పార్టీ చారిత్రక అవసరం. ఈ 40 ఏళ్ల వేడుకతో మరోసారి కొత్త పోరాటానికి కార్యోన్ముఖులమవుదామంటూ రాజకీయ తీర్మానంలో పిలుపిచ్చింది. భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోజు ఎన్టీఆర్ ఎలా రాజకీయం చేశారో.. ఈరోజు చంద్రబాబు కూడా అదే దృష్టితో రాష్ట్రం కోసం పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటూ తీర్మానంలో పేర్కొన్నారు.
మెరుగైన రాష్ట్రంగా తీర్చి దిద్దేలా
అధికారంలోకి రావడంలో అనుమానం లేదని తీర్మానంలో పేర్కొన్నారు. దేశంలోనే మెరుగైన రాష్ట్రంగా మళ్లీ తీర్చిదిద్దడమే లక్ష్యం.. రైతులు, మహిళలు, యువత హక్కుల కోసం, వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమించాలి. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ క్విడ్ ప్రొ కోలో లక్ష కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ మూడేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు.
ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి మాఫియాలను ప్రోత్సహిస్తూ ప్రజల ఆస్తులను కూడా బొక్కేస్తున్నారంటూ ఈ తీర్మానం సమయంలో ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని విమర్శించారు. వచ్చేఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ తీర్మానం సమయంలో నేతలు ధీమా వ్యక్తం చేసారు.