విచ్ఛిన్న శక్తులు లేకుండా ఏం చేయాలి: టిపై టాస్క్ఫోర్స్
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగితే విచ్ఛిన్నరక శక్తులకు ఆస్కారం కల్పించకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలపై అధికారులతో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బుధవారం చర్చించింది. విభజన తర్వాత అలాంటి శక్తులు చెలరేగే ప్రమాదం ఉందని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉండాలని టాస్క్ఫోర్స్ అభిప్రాయపడింది. అధికార వర్గాలతో టాస్క్ఫోర్స్ సభ్యులు సమావేశాలు జరుపుతున్న విషయం తెలిసిందే.
బుధవారం సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్లో సమావేశం నిర్వహించారు. మంగళవారం నాటి భేటీలో పాల్గొన్న అధికారులతోపాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు హెచ్జె దొర, పేర్వారం రాములు, విజయ రామారావు తదితరులను కూడా బుధవారం నాటి చర్చలకు ఆహ్వానించారు. ఇటీవలి కాలంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడగా జార్ఖండ్, చత్తీస్గడ్లలో మావోయిస్టులు బలోపేతమై శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా కొందరు అధికారులు ప్రస్తావించారు.
ఎపి విభజన జరిగితే అలాంటి శక్తులకు అస్కారం కల్పించకుండా ఏం చేయాలనే విషయమై పలువురు అధికారులు సూచించారు. నిఘా విభాగం చీఫ్ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, సీనియర్ ఐపిఎస్ అధికారులు జెవి రాముడు, మాలకొండయ్య, గౌతమ్ సవాంగ్, దామోదర్తోపాటు మరికొందరు అధికారులు కూడా నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ స్వరూప, స్వభావాలపై టాస్క్ఫోర్స్ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే రాష్ట్రంలోని పోలీసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేవాలయాలు, ప్రార్థనామందిరాల పరిరక్షణకు ఉన్న ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఇరు ప్రాంతాల ప్రజల్లోనూ అపోహలు చెలరేగి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున వారి భయాందోళనలను తొలగించేలా ఏర్పాట్లు ఉండాలని అందరూ అభిప్రాయపడ్డారు. ఈ భేటిలో హైదరాబాద్ స్టేటస్ ఎలా ఉండాలన్న అంశంపై చర్చ జరగలేదని, కేవలం భద్రతాపరమైన అంశాలపైనే ఆహ్వానితుల నుంచి సమాచారం సేకరించామని టాస్క్ఫోర్స్ సభ్యులు తెలిపారు.