విభజన తర్వాత లా&ఆర్డర్: విజయ్, టెక్కీ రిప్.లతో భేటీ
హైదరాబాద్: విభజన తర్వాత రెండు ప్రాంతాలలో శాంతిభద్రతలు సమర్థవంతంగా ఉండేలా అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ టాస్క్ఫోర్స్ బృందం చీఫ్ విజయకుమార్ గురువారం తెలిపారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతితో ఉదయం భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తాము మూడు నాలుగు రోజుల్లో తమ నివేదికను అందజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీసింగుకు మంచి పేరుందని, దానిని మరింత బలోపేతం చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. శాంతిభద్రతలో రక్షణలో ఎపి పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు.
హైదరాబాదు అంశమే కాక నక్సలిజం, తీవ్రవాదం అంశాల పైన తాము అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల నుండి తాము సమాచారం సేకరిస్తున్నామని, అందులో భాగంగానే సిఎస్ను కలిశామన్నారు.
మరోవైపు టాస్క్ఫోర్స్ బృందం హెచ్ఆర్డీలో సాఫ్టువేర్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. సిఐఐ ఎపి సెక్టార్ మాజీ అధినేతహరిశ్చంద్ర ప్రసాద్, ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.
హైదరాబాద్ ప్రజల రక్షణ బాధ్యత మాది: దానం
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఇక్కడి ప్రజాప్రతినిధులు కీలుబొమ్మలు అవుతారని, నగర ప్రజల బాధ్యత తమదేనని మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు. కేంద్రపాలిత ప్రాంతం చేస్తే హైదరాబాద్ ప్రజలు సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లాలా అని ప్రశ్నించారు. సోనియాను విమర్శించి పెద్ద నేత అవుదామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్ అనుకుంటే అది ఆయన అవివేకమన్నారు.