టీసీ టిక్కెట్ అడిగారని.. కదుల్తున్న రైల్లోనుండి తోసేశారు
వరంగల్/కరీంనగర్: రైలులో టికెట్ అడిగినందుకు నడుస్తున్న రైలు నుంచి టికెట్ కలెక్టర్ను తోసివేసిన సంఘటన సోమవారం మధ్యాహ్నం వరంగల్ - రామగుండం మార్గంలో జరిగింది. ఇద్దరు ప్రయాణీకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళుతున్న కేరళ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో టికెట్ కలెక్టర్ విజయ్ కుమార్ సోమవారం మధ్యాహ్నం వరంగల్లో డ్యూటీ ఎక్కారు.
జనరల్ బోగిలో ప్రయాణికులను తనిఖీ చేస్తున్న సందర్భంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద టికెట్ లేకపోవడంతో వారిని జరిమానా కట్టాలని చెప్పారు. కానీ టీసీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ ఇద్దరు ప్రయాణికులు టీసీతో గొడవపడి వేగంగా వెళుతున్న రైలు నుంచి టిసిని బయటకు నెట్టివేశారు.
ఈ సంఘటనలో టీసీకి గాయాలయ్యాయి. ఇది గమనించిన ప్రయాణికులు తదుపరి స్టేషన్లో రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో తిమ్మాపూర్ - బుజగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ పక్కన బలమైన గాయాలతో ఉన్న విజయ్ కుమార్ను మొదట జమ్మికుంట ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వరంగల్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే అధికారులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.
నిందితుల అరెస్ట్
కేరళ ఎక్స్ప్రెస్ రైలు నుండి టీటీఈని తోసేసిన కేసులో ఇద్దరు దుండగుల్ని రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైన్ లోంచి కిందపడిన టీటీఈ విజయ్ కుమార్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను సికింద్రాబాద్ రైల్వే జీఎం శ్రీవాస్తవ పరామర్శించారు.