కంచ ఐలయ్యపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, ప్రభుత్వం అలా చేస్తే సరే: టిజి వెంకటేష్
వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పైన టిడిపి నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ బుధవారం నాడు నిప్పులు చెరిగారు. ఐలయ్య పైన తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
కర్నూలు: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పైన టిడిపి నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ బుధవారం నాడు నిప్పులు చెరిగారు. ఐలయ్య పైన తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
చదవండి: కోమట్లు ఇష్యూ: ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక విసురుగా వెళ్లిపోయిన ఐలయ్య
ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను
ఓ మతాన్ని, కులాన్ని అవమానపరిచేలా రాతలు రాసే కంచ ఐలయ్య లాంటి వాళ్లను నడిరోడ్డుపై ఉరి తీయాలనే వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని టీజీ వెంకటేష్ చెప్పారు. తాను హద్దులు దాటలేదని అభిప్రాయపడ్డారు.
చట్టం మార్చి ఉరితీయాలని చెప్పా
తాను ఆ రోజు ఏం అన్నానో టీజీ వెంకటేష్ మరోసారి చెప్పారు. కులాలను, మతాలను రెచ్చగొట్టే వారిని చట్టం మార్చి ఉరి తీయాలని తాను చెప్పానని అన్నారు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.
మళ్లీ చెప్తున్నా
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అమాయకుల మృతికి కారణం కావొద్దని, చిచ్చు పెట్టే విధంగా రాతలు రాసిన కంచ ఐలయ్యను ఉరితీయాలని, అవసరమైతే చట్టాలను మార్చాలని పునరుద్ఘాటించారు.
ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి
కంచ ఐలయ్య బీసీ, ఎస్సీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టిజి వెంకటేష్ అన్నారు. తాను హద్దు మీరి మాట్లాడుతున్నానని కంచ ఐలయ్య చెప్పారని, కానీ ఆయనే హద్దుమీరి మాట్లాడారన్నారు. కంచ ఐలయ్య రాసిన పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధిస్తే సమస్య పరిష్కారమవుతుందని, ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయాలన్నారు.