జగన్ వద్దకు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు : ప్రమాణ స్వీకారానికి హాజరు: అవమానాలు జరగలేదు..!
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముందు ఒక ఆసక్తి కర పరిణామం చోటు చేసుకోనుంది. టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ వద్దకు రానున్నారు. టీడీపీ శాసనసభా పక్షం..పార్టీ అధినేత కొత్తగా ఏపీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్న జగన్కు అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను అందించనున్నారు. వారు మధ్నాహ్నం జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.
జగన్ వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు..
తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని.. ఆ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ నేరుగా చంద్రబాబు కు ఫోన్ చేసారు. దీంతో..జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలా వద్దా అనే అంశం మీద టీడీఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది.చంద్రబాబు తాను జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లానుకుంటున్నానని చెప్పగా..మిగిలిన నేతలు గతంలో ఎప్పుడూ ప్రత్యర్ధి పార్టీల నేతలు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే వెళ్లిన సందర్బాలు లేవని చెబుతూ..వారించారు. దీంతో.. వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారానికి హాజరుకాకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావును పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందే అభినందనలు తెలిపేందుకు.. జగన్ నివాసానికి టీడీపీ బృందం వెళ్లనుంది.
జగన్ను అవమానించలేదు..
తమ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ను ఏనాడు అవమానించలేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఇప్పుడు తమను అవమానిస్తారనే అనుమానాలు లేవని చెప్పుకొచ్చారు. సభలో జగన్ ను మాట్లాడనీయకుండా మైక్ కట్ చేయటం..అధికార పక్షం నుండి జగన్ను దూషించేందుకు ఎక్కువ సమయం ఇవ్వటం లాంటి వాటితో ఇప్పుడు వైసీపీ సైతం అదే విధంగా వ్యవహరిస్తుందనే అంశం పైన చర్చ సాగింది. దీనికి ప్రతిగా టీడీపీ నేతలు తాము ఎప్పుడూ వైసీపీ ఎమ్మెల్యేను అవమానించేలా వ్యవహరించలేదని వివరణ ఇచ్చారు. ఇక, ఇప్పుడు సభలో ప్రతిపక్షంగా తమ వంతు పోరాటం చేస్తామని..ప్రజా సమస్యల పైన నిలదీస్తామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని స్పష్టం చేసారు.