ఒకే రాజధాని: టీడీపీఎల్పీ భేటీలో కీలక చర్చ, జగన్ సర్కారుకు హెచ్చరికలు, గంటా ఏమన్నారంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. ఆదివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలు పాల్గొన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఒకే రాజధాని..
మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం అసెంబ్లీ, మండలిలో బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో ఎలాంటి వైఖరి అవలంభించాలన్నదానిపై నేతలు కీలకంగా చర్చించారు. పలువురు నేతలు తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు. ఆదివారం రాత్రి ఈ సమావేశం ముగిసిన అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు టీడీపీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్కు టీడీపీ కట్టుబడి ఉందని రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలోనూ ‘ఒకే రాజధాని-ఒకే అసెంబ్లీ'కి అనుకూలంగానే తమ వాదనలు ఉంటాయని తెలిపారు.
విశాఖ, సీమకు ఒరిగేదేమీ లేదు..
అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుతో ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు. విశాఖపట్నం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా మారిందని రామానాయుడు వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. శాంతియుతంగా రాజధాని కోసం ఆందోళన చేస్తున్న ప్రజలు, మహిళలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
నిరంకుశంగా వ్యవహరిస్తే..
ప్రజాగ్రహం ముందు ప్రభుత్వ ఆటలు సాగవని తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమరావతి మార్పు గురించి చెప్పారా? అని సీఎం జగన్మోహన్ రెడ్డిని రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలను సేకరించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అంతేగానీ, రాజధాని మార్పుపై నిరంకుశంగా వ్యవహరిస్తామంటే మాత్రం ప్రజాగ్రహానికి గురికాక తప్పదమని జగన్ సర్కారును రామానాయుడు హెచ్చరించారు. అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.. పరిపాలన వికేంద్రీకరణ కాదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.
టీడీపీఎల్పీకి భేటీకి గంటా దూరం.. ఏమన్నారంటే..
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి పార్టీలో కొందరు కీలక నేతలు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని సమావేశానికి హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతోనే తాము ఈ సమావేశానికి రాలేకపోయామని నేతలు చెబుతున్నారు. అయితే, సోమవారం అసెంబ్లీకి మాత్రం ఎమ్మెల్యేలు వస్తారని టీడీపీ చెబుతోంది. కాగా, విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు ప్రకటనను ఇప్పటికే గంటా శ్రీనివాసరావు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ రాజధానిపై ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టబడి ఉంటానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేసినట్లు తెలిసింది.