జీవో 107పై టీడీపీ యాక్షన్ ప్లాన్ .. మూడు రోజుల పాటు కార్యాచరణ
ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం , జారీ చేసిన జీవోపై టీడీపీ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాజధాని పరిధిలో సేకరించిన భూములను నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ పంపిణీకి సంబంధించి జీవో 107 విడుదల చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాజధాని అమరావతి ఉద్యమాన్ని నీరు గార్చేందుకే అని భావిస్తున్న టీడీపీ రేపట్నించి మూడు రోజుల పాటు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది .
టార్గెట్ అమరావతి .. రాజధాని భూములపై ఏపీ సర్కార్ వివాదాస్పద నిర్ణయంతో రగడ
జీవో 107 అంశంపై ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రచారం
జీవో 107 అంశంపై ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలకు తాజా పరిస్థితిని వివరించాలని నిర్ణయించింది టీడీపీ . మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు ఈ మేరకు నాయకులతో చర్చించారు . రాజధాని ప్రాంతంలో కృష్ణ, గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాల కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 107 కుట్ర పూరితంగా ఇచ్చిన జీవో అని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి స్థలాలు ఇవ్వజూపడం అమరావతిని దెబ్బ తీసేందుకెన్ని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడ్డారు.
జీవో 107... రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర
సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని పోరాటాన్ని నీరు గార్చటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ భావిస్తుంది. టీడీపీ హయాంలోనే నిర్మాణమై సిద్ధంగా ఉన్న గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇప్పుడు స్థలాలను ఇవ్వాలని , అందులోనూ రాజధాని గ్రామాల్లోనే ఇవ్వాలని చూడటం వ్యూహాత్మక చర్య అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. సీఆర్డీఏ చట్టాన్ని వైసీపీ సర్కార్ ఉల్లంఘిస్తుందని సమావేశంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మూడు రోజుల పాటు జీవో 107పై భారీ ప్రచారం చెయ్యనున్న టీడీపీ
రాజధానిని కదిలించలేని పరిస్థితి ఉన్న కారణంగా అమరావతి భూముల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ప్రజాక్షేత్రంలో ప్రస్తుతం ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న టీడీపీ మూడు రోజుల పాటు ఫిబ్రవరి 27 నుంచి 3 రోజుల పాటు అమరావతిపై ప్రభుత్వ విధానాలను ప్రజా చైతన్యయాత్ర ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. జీవో 107పై మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యనుంది టీడీపీ . తద్వారా రాజధాని అమరావతిపై చేసిన కుట్రను ప్రజలకు చెప్పాలని నిర్ణయం తీసుకుంది.