పార్టీ బలోపేతం కోసం టిడిపి చర్యలు:తెలుగు తమ్ముళ్లకు స్పెషల్ ట్రయినింగ్,నజరానాలు
అమరావతి:సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టిడిపి క్షేత్రస్ధాయిలో చర్యలు ఆరంభించింది. పోలింగ్ బూత్ స్ధాయిలో పట్టు సంపాదించడం కోసం కార్యాచరణ ప్రణాళికలు అమలుచేస్తోంది. ఆ ప్రకారం ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది నాయకులు, కార్యకర్తలకు టిడిపి శిక్షణ ఇస్తోంది.
మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారికి ఆధునిక పద్ధతుల్లో శిక్షణ నివ్వడమే కాదు స్మార్ట్ ఫోన్ల నజరానా, యాప్ లపై అవగాహన కల్పిస్తోందట. ఈ శిక్షణతో తెలుగు తమ్ముళ్ల ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతుందనేది పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు తెలుసుకునేలా యాప్ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆ పార్టీ ఏడు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వ కార్యక్రమం...పార్టీకి ప్రయోజనకరం
టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామదర్శిని కార్యక్రమం అటు పార్టీ కోసం కూడా ఉపయోగపడేలా రూపొందినట్లు కనిపిస్తోంది. అభివృద్ధి పనుల వేగవంతం పేరిట ఎప్పటికప్పుడు సమాచారం కోసం టిడిపి నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిందిగా అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన నోడల్ అధికారుల సమావేశంలో ఒక్కో నోడల్ అధికారి ఒక్కో నాయకుడిగా ఎదగాలని సిఎం చంద్రబాబు సూచించడం వెనుక ఇలాంటి పకడ్బందీ వ్యూహం ఉందనేది ప్రతిపక్ష నేతల అభిప్రాయం. అంతేకాదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోల్ మేనేజ్మెంట్పై బూత్ లెవల్ కమిటీ సభ్యులు, సేవామిత్ర, సాధికారమిత్ర, టిడిపి సర్పంచ్లు, ఎంపిటిసిలు, ఇతర నాయకులందరికీ సమగ్ర శిక్షణ ఇస్తున్నారు.
Recommended Video
శిక్షకులు...వేతనాలు
ఈ శిక్షణ కోసం పార్టీ పట్ల సానుకూలత...పూర్తి అవగాహన ఉన్న వారని ట్రయినర్లుగా నియమించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 43 వేలమందిని బూత్లెవల్ కమిటీ సభ్యులుగా, మరో నాలుగున్నర లక్షల మందిని సేవామిత్రలుగా ఎంపిక చేశారట. ఈ శిక్షకులకు, కో-ఆర్డినేటర్లుకు నెలకు రూ.30 నుంచి రూ. 35 వేల వరకు గౌరవ వేతనం చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక శిక్షణకు ఎంపికైన బూత్లెవల్ కమిటీ సభ్యులు, సేవామిత్ర, సాధికార మిత్రలు 5 లక్షల మందికి సుమారు రూ.8 వేలు విలువజేసే కార్బన్ కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లను ఉచితంగా ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో పాటు అమలు కూడా చేస్తోందట.
శిక్షణతో పాటు...సెల్ ఫోన్ ఇచ్చారు
ఇలా శిక్షణకు హాజరవుతున్న బూత్లెవల్ కమిటీ సభ్యులకు రెండవ రోజు శిక్షణ ముగియడంతోనే ఒక సర్టిఫికెట్తో పాటు కార్బన్ సెల్ఫోన్నూ అందిస్తున్నట్లు తెలిసింది.ఈ శిక్షణ,సెల్ఫోన్లు, కంప్యూటర్లు, టెక్నాలజీ వినియోగం తదిదరాల కోసం టిడిపి సుమారు రూ.7 కోట్లు వెచ్చిస్తున్నట్లుగా సమాచారం. శిక్షణ పొందిన తెలుగు తమ్ముళ్లు తమకు ఇచ్చిన స్మార్ట్ ఫోన్లో ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు వారి ప్రాంతాల్లో ఏయే పనులు చేపడుతున్నారు, పార్టీ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అనే విషయాలను ఫోటోలతో సహా సమాచారాన్ని పార్టీ టెక్నికల్ విభాగానికి పంపించే విధంగా ట్రయినింగ్ ఇవ్వడం జరుగుతోందట. ఇందుకోసమే ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించారని...కార్యకర్తలు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సమాచారాన్ని వీలైనంత త్వరగా పార్టీ మానిటరింగ్ వింగ్ కు పంపించాలని తెలిసింది.
డైరెక్టర్లు...సేవామిత్రలు...నియామకం
ఇక జనాల నాడిని పసిగట్టేందుకు ప్రతి వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున సేవామిత్రలను నియమించారు. వీరు తమ పరిధిలోని ఓటర్లకు సబ్సిడీ పథకాలు, హౌసింగ్, రుణాలు అందేలా చూడటం, అలాగే కార్పొరేషన్ల ద్వారా లబ్ధిపొందని వారిని గుర్తించి నోడల్ అధికారికి సమాచారం ఇవ్వడం చేస్తారట. ఆయా పనులు పూర్తి కాగానే లబ్ధిదారుడిని టిడిపికి ఓటు వేసే విధంగా చూడటం వరకూ పార్టీ సేవామిత్ర, ప్రభుత్వ సాధికారమిత్రల పనిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పర్యవేక్షించేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొందరు డైరెక్టర్ల నియామకం కూడా జరిగింది.
వీళ్లే...ఆ డైరెక్టర్లు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పార్లమెంట్ నియోకవర్గాల పరిధిలో కలిశెట్టి అప్పల నాయుడు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలకు గోపాలపురం నియోజకవర్గానికి చెందిన మద్దిపాటి వెంకటరాజు, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేట, గుంటూరు, బాపట్ల పార్లమెంట్ స్థానాల కోసం కందుకూరు నియోజకవర్గానికి చెందిన కంచెర్ల శ్రీకాంత్, రాజంపేట, కర్నూలు, కడప పార్లమెంట్ స్థానాలకు పులివెందులకు చెందిన రామ్భూపాల్రెడ్డి, అనంతపురం, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ పరిధిలో మద్దిబొట్ల సూర్యప్రకాశ్లకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలిసింది.