పడగ విప్పిన ఫాక్షన్ కక్షలు: టిడిపి కార్యకర్త దారుణ హత్య
అనంతపురం/ గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో మరోసారి ఫాక్షన్ కక్షలు పడగ విప్పాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మల్లికార్జున్ సోమవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీశక్తి భవన్ వద్ద మల్లికార్జున్ను ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేసి, ఆ తర్వాత శవాన్ని నీటి గుంటలో పడేశారు.
పెన్నా నది ఇసుక మాఫియా గొడవలే మల్లికార్జున్ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ గొడవ పరిష్కారానికి సోమవారం తెల్లవారు జామును ఇరు వర్గాలు సమావేశం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సమయంలో ప్రత్యర్థులు మల్లికార్జున్ను హత్య చేశారని అంటున్నారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, గుంటూరు నగర శివారులోని చిలకలూరిపేట రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో ఉద్దిశెట్టి రవి (30) అనే రౌడీ షీటర్ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఇతను తన మిత్రుడు గోపితో కలిసి ద్విచక్రవాహనంపై నగరంలోకి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేసి, చంపేశారు.
ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని నీటిగుంటలో పడేశారు. ఇతనిపై నగరం పాలెం పోలీసు స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. గతంలో స్టేషన్తో పాటు, నగర పరిసరాల్లో జరిగిన నాలుగు హత్య కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.