ముందస్తుకు టిడిపి నో...జమిలి ఎన్నికలపై టిడిపి వ్యతిరేకత:లేఖ ఇచ్చేశారు
అమరావతి:జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఆమేరకు టిడిపి ఆదివారం జాతీయ న్యాయ కమిషన్ కు ఒక లేఖను సైతం అందచేసింది.
జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని జాతీయ న్యాయ కమిషన్ జమిలి ఎన్నికలపై గత రెండురోజులుగా వివిధ రాజకీయపార్టీల అభిప్రాయాలు స్వీకరిస్తోంది. పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణా రాష్ట్రం జమిలి ఎన్నికలకు తమ అనుకూలతను తెలియజేయగా, టిడిపి ఎంపీలు మాత్రం ఆ కమీషన్ ముందు హాజరై జమిలి ఎన్నికల పట్ల తమ పార్టీ వ్యతిరేకతను తెలుపుతూ 6 పేజీల అభిప్రాయప్రతిని అందజేశారు.
మేము సిద్ధంగా లేం:టిడిపి
జమిలి ఎన్నికలపై జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని జాతీయ న్యాయ కమిషన్ గత రెండురోజులుగా వివిధ రాజకీయపార్టీల అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఆదివారం తెదేపా లోక్సభాపక్షనేత తోట నరసింహం, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వారి ముందు హాజరై టిడిపి తరుఫున తమ పార్టీ అభిప్రాయంతో కూడిన 6 పేజీల లేఖను అందజేశారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని...ముందస్తుకు తాము అంగీకరించలేమని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 16వ లోక్సభను రద్దుచేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లినా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని టిడిపి తేల్చిచెప్పేసింది.
Recommended Video
ఇక్కడ సాధ్యం కాదు...ఎందుకంటే?
మనదేశంలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారుతూ ఉంటాయని...ఆ కారణంగా మధ్యంతర ఎన్నికలకు ఎప్పుడూ అవకాశం ఉండే మన దేశంలో ఇలా జమిలి ఎన్నికలు అనే ప్రక్రియ ఏమాత్రం ఆచరణ సాధ్యంకాదని టిడిపి విశ్లేషించింది. ఇందుకు ఇప్పుడున్న రాజ్యాంగం సరిపోదని స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్ర జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే రాజ్యాంగం, దాంతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని టిడిపి పేర్కొంది. పార్లమెంటు, అసెంబ్లీల కాలపరిమితి ఇష్టం వచ్చినట్లు కుదించడం కుదరని పని టిడిపి అభిప్రాయపడింది. అయితే అలా చేసి ఎన్నికలకు వెళ్లినా ప్రజా ప్రభుత్వాలు అయిదేళ్లపాటు పూర్తికాలం పదవిలో ఉంటాయనడానికి ఏమైనా గ్యారెంటీ ఉంటుందా?...అని టిడిపి ప్రశ్నించింది. ఎన్నో రాజకీయ సంక్లిష్టతలున్న ఈ దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం అసాధ్యమని టిడిపి అభిప్రాయపడింది.
ఈవిఎంలు...మౌలికవసతులు లేవు
ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళ్లినా ఓటర్లలో విశ్వాసం కోసం అన్ని ఈవీఎంలకు తప్పనిసరిగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్, ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్లు) అనుసంధానం చేయాలని, అది చేయలేనప్పుడు బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని టిడిపి తేల్చిచెప్పింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేంత మౌలికవసతులు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రస్తుతానికైతే లేవని, అలా వెళ్లాలంటే 75 లక్షల ఈవీఎంలు అవసరం అవుతాయి కాబట్టి ముందు వాటి సంగతి చూడాలని టిడిపి సూచించింది. స్వాతంత్రానంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, ప్రజా ప్రభుత్వాల కాలపరిమితులు, వాటి పతనాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు, రాజకీయ సంక్లిష్టతలను ఈ సందర్భంగా తమ లేఖలో టిడిపి వివరించింది.
అలా జరిగింది...మరి ఇలా చేయాలా?
‘‘జమిలి ఎన్నికలేం దేశానికి కొత్తకాదని టిడిపి విశ్లేషించింది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత 1957 నుంచి 1967 వరకు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. 1970లో 4వ లోక్సభను అర్ధంతరంగా రద్దుచేసి 1971లో ఎన్నికలు నిర్వహించారు. అలా ఎన్నికలు జరిగి ఏర్పడిన ప్రభుత్వాలు నిర్దిష్ట ఐదేళ్ల కాలం పూర్తికాకుండానే పతనమయ్యాయి. ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రతిపాదన మంచిదే కావచ్చు...కానీ దానిపై రాజకీయ ఏకాభిప్రాయం, లోతైన అధ్యయనం, ప్రణాళిక ఆవశ్యం. సరైన మెజార్టీ లేనప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయిస్తే ప్రభుత్వ మనుగడ సందిగ్ధంలో పడిపోతుంది. 1998లో వాజ్పేయి ప్రభుత్వం మాదిరి కేంద్ర ప్రభుత్వం 30 రోజుల్లోనే కూలిపోయింది. అలాంటి సందర్భాల్లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దుచేయాలా?...దేశమంతా లోక్సభతోపాటు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?...ఈ ఆలోచన రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా, ప్రజాభిప్రాయాన్ని తృణీకరించే విధంగా ఉందని టిడిపి అభిప్రాయం వ్యక్తం చేసింది.
వివిప్యాట్...కావాలి
ఒకేదేశం ఒకే ఎన్నిక అనేది...ఒకే దేశం ఒకే పన్నులాంటిదే...ఈవీఎంల విషయంలో జాతీయ, రాజకీయపార్టీల మధ్య విశ్వాస నిర్మాణానికి సంబంధించి మాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఈవీఎంలన్నింటికీ వీవీప్యాట్ లు అనుసంధానం చేయాలి. ‘స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణకోసం పేపర్ ట్రయల్ అనివార్యం. అది ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే ఈవీఎంలపై ఓటరు విశ్వాసాన్ని చూరగొనడం సాధ్యమవుతుంది' అని ఒకనాటి ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం చెప్పారు. ఆ తర్వాత ఎన్నో ఎన్నికల్లో వీవీప్యాట్స్ను విజయవంతంగా ఉపయోగించారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే వీవీప్యాట్లతో కూడిన ఈవీఎంలు 75 లక్షలు అవసరమవుతాయి. ప్రస్తుతం 19లక్షలే ఉన్నాయి. వాటి తయారీకి డబ్బు, సమయం కావాలి. ఇవేవీ లేకుండా జమిలి ఎన్నికలకు వెళ్లడం సాధ్యంకాదని కేంద్ర న్యాయ కమిషన్కు టిడిపి అందించిన అభిప్రాయపత్రంలో స్పష్టం చేసేసింది.