ప్రచారంలో ముందున్న టీడిపి..! కాని మంత్రుల గెలుపు పై నెలకొన్న సందేహాలు..!!
అమరావతి/హైదరాబాద్ : పోటా పోటీ గా సాగుతున్న ఏపి ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉద్రుతంగా నిర్వహిస్తున్నాయి. ఐతే మంత్రుల గెలుపు మాత్రం అదికార పార్టీని కలవరానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెళ్లినంతంగా ప్రజాక్షేత్రంలోకి మంత్రులు వెళ్లలేకపోతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ప్రభావం చూపాల్సిన మంత్రులు ఇంత వెనకబడి పోవడాన్ని అదికార పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఒకవేళ చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసేంత మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా.. వారిలో మంత్రులు మాత్రం కనిపించరనే కొత్త వాదన అమాత్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తోందట.
ఏపిలో అదికార పార్టీఎకి అంతా ఓకే..! కలవర పెడుతున్న మంత్రుల వ్యవహారం..!!
ఉత్తరాంధ్రలో మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, కళావెంకట్రావు, సోమిరెడ్డి, నారాయణ, ఆదినారాయణరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు.. ఇలా 11 మంది పేర్లు ప్రత్యర్థి పార్టీ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతున్నారు. అయితే సదరు మంత్రుల వల్ల కాస్తో కూస్తో నష్టపోయిన ఎమ్మెల్యేలు మాత్రం మంత్రుల ఓటమి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించిన మంత్రులు..! ఓటమిని కాంక్షిస్తున్న సొంత ఎమ్మెల్యేలు..!!
మంత్రలు ఓడాలని కోరుకునే వారిలో ప్రత్యర్తి నేతలే కాకుండా ఇంటి పార్టీ నాయకులు కూడా వుండడం విశేషం. నెల్లూరు జిల్లాలో రెండుసార్లు వరుసగా ఓడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని నారాయణ ఇద్దరూ అక్కడ నెగ్గటం అంత తేలిక కాదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గంటాపై పెరిగిన ఆరోపణలు. భూ కబ్జా వ్యవహారంలో కేసులు. తనవారికి లబ్డి చేకూర్చేందుకు చేసిన పనులు ఇవన్నీ ఆయన మెడకు చుట్టుకుని ప్రతికూల పరిస్థితులు తలెత్తినట్టు తెలుస్తోంది.
పేరుకే హోంమత్రి..! హోంగార్డుకి కూడా ఆదేశాలు ఇవ్వలేని చినరాజప్ప..!!
చినరాజప్ప హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినా హోంగార్డు బదిలీ కూడా చేయలేనంత రబ్బరు స్టాంపుగా మారాడనే విమర్శలు ఉన్నాయి. చినబాబు లోకేష్ సారథ్యంలోనే పోలీసు శాఖ పనిచేసిందనేందుకు రుజువులు అనేకం ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీ చెప్పుకొస్తోంది. దేవినేని ఉమాపై పోలవరంలో జరిగిన అవినీతి ఆరోపణలు.. మైలవరం అభివృద్ధిలో చేసిన నిర్లక్ష్యం శరాఘాతంలా పరిణమించాయి. నందిగామలో పేరుకే సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్నారని, అన్నీ తానై అక్కడా ఉమా చక్రం తిప్పారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మంగళగిరిలో లోకేష్ గెలుపు డౌటే..! అదికార పార్టీ అండతో బయటపడే అవకాశం..!!
మంగళగిరిలో లోకేష్బాబు గెలుపు కూడా అంత ఈజీ కాదంటున్నారు. కానీ సీఎం తనయుడు కావటంతో ఏదో విధంగా బయటపడేందుకు చివరి వరకూ అధికార, అనధికార యంత్రాంగం సాయ పడుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రత్తిపాటి పుల్లారావుపై ఎన్నో ఆరోపణలు. వ్యవసాయశాఖ మంత్రిగా రైతులకు ఆయన చేసిందేమీ లేదనే అపవాదు. వెరసి.. మంత్రులకు.. ఓటర్లు చుక్కలు చూపబోతున్నారనే ప్రచారం టీడీపీని ఇరుకున పెట్టబోతున్నట్ట తెలుస్తోంది. ఒకవేళ అమాత్యులు గెలిచినా మళ్లీ బాబు కేబినెట్లో బెర్త్ దక్కించుకోవటం సగం మందికి కష్టమేనంటున్నాయి టీడీపీ వర్గాలు.