'జగన్ కోసం టీడీపీ డాటా దొంగిలించే యత్నం.. తెరముందే టీ పోలీసులు.. తెరవెనుక చక్రం'
విజయవాడ: టీడీపీ, వైసీపీల మధ్య ఓట్ల తొలగింపు వ్యవహారం వేడి రాజుకుంది. పరస్పరం ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకుంటున్నారు. హైదరాబాదులోని ఐటీ ఉద్యోగులు కనిపించకుండా పోవడంపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్, దేవినేని ఉమ, కిమిడి కళా వెంకట్రావులతో పాటు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర విమర్శలు గుప్పించారు.
వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏపీ-తెలంగాణ మధ్య డేటా యుద్ధం!: హైదరాబాద్లో హైడ్రామా, అసలేం జరిగిందంటే?
జగన్ కోసం.. ఐటీ కంపెనీ నుంచి టీడీపీ సభ్యత్వాలు దొంగిలించే ప్రయత్నం
ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం మోడీ సమేత కల్వకుంట్ల జగన్కు సిగ్గుగా అనిపించడం లేదా అని లోకేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక కుట్రలతో ఏపీ అభివృద్ధిని, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేక ముగ్గురు మోడీలు ఒక్కటై టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీపై తెలంగాణ పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. టీడీపీ సభ్యత్వాలు, సేవామిత్రాల సమాచారం దొంగిలించే ప్రయత్నాలు చేశారన్నారు. జగన్ను అడ్డదారిలో సీఎం చేయాలని మోడీ, కేసీఆర్ చూస్తున్నారని, మోడీ డైరెక్షన్, ఫ్యాక్షనిస్ట్ జగన్, యాక్షన్ దొర కేసీఆర్ ప్లాన్కు ఏపీ ప్రజలే రియాక్షన్ ఇస్తారన్నారు.
తెరాస కూడా అలా సేవలు వినియోగించుకుంది
వైసీపీకి టీడీపీని ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే తెరాస, బీజేపీ సహకారంతో ఏపీపై దాడి చేస్తోందని దూళిపాళ్ల అన్నారు. తెలుగువారి పౌరుషం గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ ప్రజలను రెచ్చగొట్టేలా తెరాసతో కలిసి వైసీపీ.. ఏపీ ప్రయోజనాలు పణంగా పెడుతోందన్నారు. ఎంతోమంది, ఎన్నో రకాలుగా ప్రయివేటు సంస్థల సేవలను వినియోగించుకుంటారని, తెరాస కూడా అలాగే చేసిందన్నారు.
ఆపే కుట్రలు చేస్తున్నారు
ఐటీ కంపెనీలపై దాడులతో వైసీపీ, తెరాస సంబంధం బయటపడిందని దేవినేని ఉమ అన్నారు. విజయసాయి రెడ్డి ఫిర్యాదుతో వైసీపీ, తెరాస బంధానికి ముసుగు తొలిగిందన్నారు. ఢిల్లీ డైరెక్షన్లో ఐటీ దాడుల ద్వారా ఏపీలోని సంక్షేమ పథకాలను ఆపే కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు ఫిర్యాదుతో ఓట్లు తొలగించాలని వైసీపీ కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమ సంక్షేమ కార్యక్రమాలు ఆగవని చెప్పారు. హైదరాబాదులో వ్యాపారాలు ఉన్న వారిని బెదిరించి వైసీపీలో చేర్చుకుంటున్నారన్నారు. దీని కోసం వైసీపీకి తెరాస సహకరిస్తోందని, ఎంపీ అభ్యర్థులు లేని వాళ్లను టీడీపీ నుంచి లాక్కుంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ పోలీసులను ముందుంచి చక్రం తిప్పుతున్నారు
టీడీపీకి ఐటీ సహకారం అందిస్తున్న సంస్థపై తెలంగాణ పోలీసులు దాడులకు దిగడం దారుణమని కిమిడి కళా వెంకట్రావు అన్నారు. హైదరాబాద్లోని ఆ సంస్థపై పోలీసులు సోదాలు నిర్వహించారని, ఎలాంటి సమాచారం దొరకక సంస్థ ఉద్యోగుల్ని కిడ్నాప్ చేశారని, నలుగురు ఉద్యోగుల్ని అరెస్టు చేసి తీవ్రంగా వేధించారన్నారు. ఉద్యోగులు అందుబాటులో లేకుంటే వారి కుటుంబ సభ్యులను సైతం వేధించారన్నారు. పార్టీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రల సమాచారం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారని, అవినీతి చక్రవర్తి జగన్ను అందలమెక్కించేందుకే టీఆర్ఎస్, బీజపీలు కలిసి ఇలాంటి కుట్రలకు తెరలేపాయన్నారు. విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు ఆగమేఘాల మీద సోదాలు నిర్వహించడం దారుణమని, రాజకీయ కక్షల కోసం ఇలాంటి చర్యలకు దిగడంవ హేయమన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమం, సభ్యత్వ నమోదు, సేవామిత్ర, డిజిటల్ గుర్తింపు కార్డులు వంటి సేవలన్నీ సాంకేతికత ఆధారంగా నిర్వహిస్తున్నామని, ఇలాంటి వ్యవస్థను దెబ్బకొట్టి జగన్కు లబ్ధి చేకూర్చాలని ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. జగన్ను అధికారంలోకి తెచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని, హైదరాబాద్ ఖ్యాతి దెబ్బతినేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ పోలీసులను ముందుంచి తెరవెనుక చక్రం తిప్పుతున్న టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నేతల గుట్టు త్వరలోనే రట్టు చేస్తామని, ముగ్గురికీ తగిన రీతిలో బుద్ధి చెబుతామని, కార్యకర్తలే పునాదిగా ఎదిగిన టీడీపీని వంద మంది మోడీ, కేసీఆర్, జగన్లు వచ్చినా ఏమీ చేయలేరన్నారు.