తెలంగాణాలో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసినా...ఎపిలో పొత్తు ఉండదు:తేల్చేసిన చంద్రబాబు
అమరావతి:కాంగ్రెస్ తో పొత్తు విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చేశారు. తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్తో టిడిపి కలసి పోటీ చేసినా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు.
చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలో జరిగిన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికార పీఠం అధిరోహించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా టిడిపి పనిచేయాలని, వచ్చే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలనుంచే ఆ దిశలో పనిచేయాలని టిడిపిపి సమావేశంలో నిర్ణయించారు.
టిడిపిపి సమావేశంలో
రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయం నాటికే ఆ రాష్ట్రాల ముఖ్యనేతలు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మాయావతి వంటివారితో చర్చించడం...వారిని ఎన్టిఏ కూటమికి వ్యతిరేకంగా జట్టు కట్టించి ప్రత్యామ్నాయ వేదికను సిద్దం చేయాలని, ఈ విషయంలో టిడిపినే కీలకపాత్ర పోషించాలని టిడిపిపి సమావేశంలో నిర్ణయించారు. బిజెపికి వ్యతిరేకంగా డిఎంకె వంటి పార్టీలను కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే
అవసరమైతే టిడిపి అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఆయా ముఖ్య నాయకులతో కలిసి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలనే నిర్ణయాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. ఒక పక్క ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని టిడిపిపి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
టిఆర్ఎస్ ను గద్దె దింపేందుకు
అయితే టిడిపి తనంతట తానుగా కాంగ్రెస్తో చేతులు కలుపుతుందనే ఫీలింగ్ ప్రజల్లో కలగడం మంచిది కాదని...తెలంగాణలో టిఆర్ఎస్ ను గద్దె దింపేందుకు ఏర్పాటయ్యే మహా కూటమిలో కాంగ్రెస్ తో పాటు తాము కూడా ఒక భాగస్వామే తప్ప ఆ పార్టీతో ప్రత్యక్షంగా తాము చేతులు కలపడం లేదనే విషయమై పార్టీ ఎంపీలంతా స్పష్టతతో ఉండాలని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా వారికి సూచించారు.
ఎంపి సుజనాచౌదరి
టిడిపిపి మీటింగ్ అనంతరం ఎపిలో తాజా ఐటీ దాడులపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కు ఫిర్యాదు చేయాలనే నిర్ణయంతో సహా ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఎంపి సుజనాచౌదరి, ఇతర ఎంపీలు మీడియాకు వెల్లడించారు. ఎపి విభజన హామీల అమలు విషయమై వచ్చేవారం నుంచి ఢిల్లీలో వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలసి ఒత్తిడి తేవడం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని కలసి వినతులివ్వడం, జాతీయ స్థాయిలో భావసారూప్యం ఉన్న పార్టీల కూటమి ఏర్పాటులో భాగంగా తృణమూల్ నేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ దిల్లీలో నిర్వహించనున్న సభకు హాజరవడం, విద్యుత్ రంగాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు వీలుగా బిల్లు ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్న కేంద్రం ప్రయత్నాల్ని అడ్డుకోవడం వంటివి చేయనున్నట్లు తెలిపారు.