కాంగ్రెస్ తో పొత్తు విషయం ఇంతవరకు చర్చకు రాలేదు...చంద్రబాబు ఫ్రంట్ తేవాలి:మంత్రి సోమిరెడ్డి
అమరావతి:కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోనున్నట్లు టిడిపి గురించి జరుగుతున్న ప్రచారంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తాము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటామని ఎక్కడా చెప్పలేదని, పార్టీలో ఇంతవరకు అలాంటి చర్చ కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం ఒక తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని, దీనికి సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటే బాగుంటుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కేంద్రంలో ఎన్డియేతర కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామన్నారు.
కేంద్రంలో అధికారంలో ఎన్డీయే పరిపాలన తీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం...వీటన్నింటిననీ దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో ఎన్డీయేకు వ్యతిరేకంగా అందరూ సమాయత్తం కావాలనేది టీడీపీ ఉద్దేశమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతకుమించి కాంగ్రెస్తో పొత్తు అనే అంశం ఇంతవరకు చర్చకు రాలేదని ఆయన తేల్చిచెప్పారు.
అలాగే తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి వచ్చే ఎన్నికల్లో దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా యాంటీ ఎన్డీయే అధికారంలోకి రావాలన్నది ఒక్కటే తమ అభిమతమని మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో రాజకీయంగా కూటమి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటామో అదే తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జాతీయ రాజకీయాలకు అనుగుణంగానే టీడీపీ పొత్తులు ఉంటాయని పునరుద్ఘాటించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తనకు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఇతర ముఖ్య నేతలతో సచివాలయంలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ కీలక సమావేశంలో కేంద్రంలో తిరిగి బిజెపిని అధికారంలోకి రాకుండా ఏం చెయ్యాలనేదే ప్రధాన అంశంగా చర్చ జరిపినట్లు తెలిసింది. తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.