చంద్రబాబు చెప్పిందే మేం చేస్తున్నాం: సిద్ధాంతపరంగా మండలి వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం: ధర్మాన
అమరావతి: శాసన మండలి వ్యవస్థకు తెలుగుదేశంగా పార్టీ వ్యతిరేకమని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. మండలి వ్యవస్థను తాము వ్యతిరేకమని, అధికారంలోకి వస్తే.. దాన్ని రద్దు చేస్తామంటూ ఇదివరకు చంద్రబాబు నాయుడు నిండు సభలో ప్రకటించారని చెప్పారు. మండలి వ్యవస్థ అవసరం లేదంటూ నాడు చంద్రబాబు చేసిన సూచనలను తాము ఇప్పుడు అమలు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
జాతీయ స్థాయి నాయకులెవరూ సమర్థించట్లేదు..
శాసన మండలి రద్దుపై సోమవారం శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానంపై ధర్మాన ప్రసాద రావు మాట్లాడారు. ఎన్నికలో గెలవలేని వారికి శాసన మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, ఈ శాసనమండలి వ్యవస్థ వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారని అన్నారు. మన రాష్ట్రానికే చెందిన దివంగత నేత డాక్టర్ ఎన్జీ రంగా కూడా శాసనమండలిని వ్యతిరేకించారని చెప్పారు. దేశ రాజకీయాల్లో హేమాహేమీలుగా పేరున్న గోపాలకృష్ణ అయ్యంగార్, హెచ్ వి కామత్ వంటి జాతీయ నేతలు కూడా దీన్ని వద్దనే చెప్పారని అన్నారు.
ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని ధర్మాన ప్రసాద రావు పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు తిరిగి శాసనమండలికి వస్తున్నారని, ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు ఇచ్చిన తీర్పును శాసన మండలి సభ్యులు అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. శాసన మండలి ని రద్దు చెయ్యడం పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని చెప్పుకొచ్చారు.
ప్రజోపయోగకరమైన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం..
తమకు శాసన మండలిలో బలం ఉందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం రూపొందించిన అనేక ప్రజోపయోగకరమైన బిల్లులను తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ధర్మాన విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీల కోసం తమ ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన కార్పొరేషన్ బిల్లును ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను కొనసాగించడానికి రూపొందించిన బిల్లును కూడా మండలి ద్వారా అడ్డుకొనే ప్రయత్నం చేశారని అన్నారు.
ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటే ఎలా..
ప్రజలకు మేలు చేసే బిల్లులను కూడా శాసన మండలి అడ్డుకోవడానికి ప్రయత్నించిందని, అలాంటి వ్యవస్థను రద్దు చేయడాన్ని తాను సమర్థిస్తున్నానని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను చూసే రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను తమకు అందించారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తాము నెరవేర్చబోతున్నామని అన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం సమగ్రంగా, సమతుల్యంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అలాంటి బిల్లులను అడ్డుకోవడం హాస్యాస్పదమని అన్నారు.