గెట్ రెడీ జగన్: రెడీ అవుతోన్న మరో పిటీషన్: ఈ నిర్ణయంపై హైకోర్టుకు టీడీపీ: ముహూర్తం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ నాయకులు.. మరోమారు హైకోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. చాలామటుకు కేసుల్లో తీర్పులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజా పిటీషన్పైనా జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు ఇప్పటి నుంచే వ్యక్తమౌతున్నాయి. ఈ పిటీషన్ విషయంలో టీడీపీకి అండగా..బీజేపీ నిల్చునే అవకాశాలు లేకపోలేదు.
టీటీడీ నిరర్ధక ఆస్తుల అమ్మకం టీడీపీ నిర్వాకమా?: పాలక మండలి ఏం చెబుతోంది?
తిరుమల నిరర్ధక ఆస్తులపై
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్ధక ఆస్తులను ఆన్లైన్ ద్వారా విక్రయిండానికి పాలక మండలి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం, బీజేపీ నాయకులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది. పాలక మండలి తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమని ఇప్పటికే ఈ రెండు పార్టీలతో పాటు జనసేన నాయకులు నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వంపై మతపరమైన రంగును పూయడానికీ ఈ అంశం ఉపకరిస్తోందని టీడీపీ, బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మెజారిటీ పిటీషన్లలో తీర్పులు టీడీపీకి అనుకూలంగా..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై వెలువడిన మెజారిటీ తీర్పులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్, ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్సీపీ జెండా రంగులు పూయడం, నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంలో ఏకంగా సీబీఐకి అప్పగించడం వంటి తాజా ఉదంతాలు దీనికి అద్దం పడుతున్నాయి. శాసన మండలి రద్దు అంశం, మూడు రాజధానుల ఏర్పాటు, వికేంద్రీకరణ బిల్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం.. వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. అవన్నీ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినవే.
అదే తరహాలో ఈ సారి కూడా..
అదే తరహాలో ఈ సారి కూడా తిరుమల ఆస్తుల విక్రయం అంశంపై పిటీషన్ దాఖలు చేయడానికి సమాయాత్తమౌతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. నిరర్ధక ఆస్తుల పేరుతో శ్రీవారి ఆస్తులన్నింటినీ ఖాళీ చేయడానికి జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, దాన్ని తాము అడ్డుకుని తీరుతామంటూ టీడీపీ నాయకుల ఆత్మవిశ్వాసంతో చెప్పడానికి కారణం ఇదేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీవారి ఆస్తులను విక్రయించే హక్కు, అధికారం జగన్ ప్రభుత్వానికి లేదని టీడీపీ, బీజేపీ నాయకులు ఇప్పటికే ఉమ్మడిగా గళమెత్తారు. దీనిపై ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదే సమయంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడానికీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
టీటీడీ వాదన నిలుస్తుందా?
1990లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు తాము నిరర్ధక ఆస్తులను విక్రయించడానికి పూనుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. దేవస్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయని చెప్పారు. బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, దేవస్థానం నిరర్థక ఆస్తుల అమ్మకం ప్రక్రియ 1974 నుంచి కొనసాగుతోందని వివరణ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్గా ఉన్న సమయంలో టీటీడీ పాలకమండలి 2015లో ఈ దిశగా ఓ తీర్మానం కూడా చేసిందని గుర్తు చేశారు.