తిరుపతికి భారీగా నకిలీ ఓటర్లు-పట్టుకున్న టీడీపీ, బీజేపీ నేతలు-ఈసీ వైఫల్యంపై
తిరుపతి ఉపఎన్నికలో పోలింగ్ శాతం కీలకంగా మారిన నేపథ్యంలో నకిలీ ఓటర్ల బెడద ఎక్కువవుతోంది. నిన్నటి నుంచి తిరుపతిలో ఓటేసేందుకు చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చిన పలువురిని టీడీపీ, బీజేపీ నేతలు ఎక్కడికక్కడ పట్టుకోవడంతో ఈ వ్యవహారంపై ఈసీ దృష్టిసారించాల్సిన పరిస్ధితి వచ్చింది. తిరుపతిలో నకిలీ ఓటర్ల హల్ చల్పై టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో నకిలీ ఓటర్ల హల్ చల్ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్తో పాటు అన్ని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి.
తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు
తిరుపతి లోక్సభ స్దానానికి ఇవాళ జరుగుతున్న ఉపఎన్నికలో గెలుపుకోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముక్కోణపు పోటీ నెలకొన్న ఈ పోరులో పోలింగ్ శాతం కూడా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉండటంతో అధికార వైసీపీ దీన్ని సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే చుట్టు పక్కల జిల్లాల నుంచి తిరుపతి లోక్సభ స్ధానం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలకు ఓటర్లు రావడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల పోలింగ్ సమయంలో నకిలీ ఓటర్లను పలు చోట్ల వారు పట్టుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ
తిరుపతి పోలింగ్లో దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ నేతలు బయట నుంచి వేల మందిని తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ప్రయత్నించారని వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫేక్ ఓటరు కార్డులతో ఓటేసేందుకు కడప నుంచి పలువురు వచ్చారన్న వార్తలతో పాటు వచ్చిన ఓటర్లకు స్లిప్లను వాలంటీర్లు పంపిణీ చేయడాన్నీ టీడీపీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది అటు బీజేపీ నేతలు కూడా పలుచోట్ల ఫేక్ ఓటర్లను అడ్డుకుంటున్నారు. దీంతో ఆయా చోట్ల ఉద్రిక్త పరిస్దితులు నెలకొంటున్నాయి. పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతి లోకసభ ఎన్నికల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లను యథేచ్ఛగా వేస్తున్నారని రత్నప్రభ ఆరోపించారు. దీనిపై పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశామని రత్నప్రభ వెల్లడించారు.
నకిలీ ఓట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి ఫైర్
తిరుపతిలో ఓడిపోతారని తెలిసే చంద్రబాబు కారణాలు వెతుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. తిరుపతిలో దొంగఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. దారిన పోయే బస్సులను ఆపి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. కాళహస్తికి బస్సులో వెళ్తున్న మహిళలను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. పోలింగ్ బూత్ల్లో దొంగఓట్లు వేస్తే పట్టుకోకుండా, పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులను దొంగ ఓటర్లంటారా అని పెద్దిరెడ్డి ఆక్షేపించారు. మా కళ్యాణ మండపంపై దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించారని పెద్దిరెడ్డి ఆరోపించారు. టీడీపీ అనుకూల మీడియా ఏకంగా పోలింగ్ బూత్ల్లోకి వెళ్తోందన్నారు. ప్రజాబలం లేకే టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ కుట్రలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.