వైసీపీ వైపు టీడీపీ అభ్యర్దుల చూపు.. ! సొంత అభ్యర్దులు చేజారకుండా : జగన్ కొత్త స్కెచ్..!
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు పైన రెండు ప్రధాన పార్టీల ధీమా. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల ఎక్కడో సందేహాలు..అనుమానాలు. ఇదే సమయంలో మేజిక్ ఫిగర్కు రెండు పార్టీలు దగ్గరగా వచ్చి..పోటీ పడాల్సి వస్తే పరిస్థితి ఏంటి. ఏ పార్టీ రిస్క్ తీసుకోవటానికి సిద్దంగా లేదు. ఇందులో భాగంగానే తెర చాటు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పార్టీలో ఈరకమైన అనుమానాలు వ్యక్తం వుతున్నాయి. అసలు..టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి..
జగన్ లక్ష్యంగా : చంద్రబాబు నయా స్కెచ్: కేసీఆర్కు అందుకే ఆ..సంకేతాలు ..!
టీడీపీ అభ్యర్దులను ట్రాప్ చేస్తున్నారు...
ఎన్నికల్లో పోటీలో ఉన్న కొందరు టీడీపీ అభ్యర్దులను తమ వైపు తిప్పుకొనేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ సమీక్షల్లోనే ఈ రకమైన వాదన తెర మీదకు తెచ్చిన టీడీపీ అధినాయకత్వం ఫలితాలు వెల్లడయ్యే రెండు రోజుల ముందు నుండే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రతీ జిల్లాలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే వైసీపీ గెలుస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అంతా మైండ్ గేమ్ అంటూనే.. టీడీపీ విజయం ఖాయమని చెబుతూ అభ్యర్దుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న వారిని ఎన్నికల ముందు ఏ విధంగా అయితే టీడీపీ నుండి పార్టీ మారేలా వ్యూహాలు అమలు చేసారో..అదే విధంగా ఫలితాలు వెల్లడయ్యే సమయంలోనూ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీని కారణంగానే ఫలితాల ముందు రోజు వరకూ అమరావతిలో సమీక్షలు ఏర్పాటు చేసారు.
అభ్యర్దులు చేజారుతారా..
పైకి తాము అధికారంలోకి రావటం ఖాయమని రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే హోరా హోరీ పోరు లో ఫలితాలు ఏ విధంగా అయినా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..ముందస్తు చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ముందుగానే పార్టీ నేతలకు సూచనలు చేసారు. మోదీ సహకారంతో వైసీపీ నేతలు టీడీపీ అభ్యర్దులను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రావటానికి కావాల్సిన 88 సీట్ల కంటే కొంచెం అటూ ఇటుగా సీట్లు వస్తే ఏం చేయాలనే దాని పైన ఇప్పటికే రెండు పార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. జనసేనకు ఎన్ని సీట్లు వచ్చినా తమకే మద్దతిస్తారని టీడీపీ నమ్మకంతో ఉంది. ఇక, వైసీపీ సైతం టీడీపీ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఇందులో భాగంగా..ఎక్కడా ఏమరపాటుగా ఉండకూడదని జగన్ ఆదేశించారు.
21న జగన్ కీలక సమావేశం..
ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తామని జగన్ నమ్మకంతో ఉన్నారు. అయితే, ఈనెల 16న జగన్ విదేశాల నుండి తిరిగి రానున్నారు. 19న కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఇక, 21వ తేదీన ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్దులతో పాటుగా అన్ని జిల్లాల ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. కౌంటింగ్ నాడు ఏ రకంగా వ్యవహరించాలి..19వ తేదీ సాయంత్రం నుండి వచ్చే ఎగ్జిట్ పోల్స్కు ఎలా రియాక్ట్ అవ్వాలి..అదే విధంగా ఫలితాల్లో మేజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి నిలిచిపోతే ఏం చేయాలనే దాని పైన చర్చించనున్నారు. మెజార్టీ ఖాయమని చెబుతున్నా..ముందస్తు చర్చల్లో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజారకుండా చూడాల్సిన బాధ్యత సీనియర్ నేతలకు అప్పగిస్తున్నారు. 22 ఉదయం విజయవాడ వెళ్లనున్న జగన్..23న ఫలితాలు వచ్చే సమయంలో ఉండవల్లిలో నూతనంగా నిర్మించిన నివాసం..పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.