చాంద్ బాషాకు చుక్కలు: పయ్యావుల, కందికుంట టార్గెట్ ఆ ఎమ్మెల్యేనే!
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, నేతలకు సరైనా ప్రాధాన్యం దక్కడం లేదనే వాదనలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఇతర జిల్లా పరిస్థితి ఎలా ఉన్నా అనంతపురం జిల్లాలో పరిస్థితి మాత్రం మరింత గోరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే చాంద్ బాషాకు పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత లభించడం లేదని తెలుస్తోంది. జిల్లాలో కీలకంగా ఉన్న టిడిపి నేతలు చాంద్ బాషా రాకను అప్పట్లోనే వ్యతిరేకించారు. కానీ, అందరూ కలిసి పని చేయాలని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఎదురుచెప్పలేదు.
అయితే జిల్లాలో జరిగే టిడిపి పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చాంద్ బాషాకు కొంత అవమానకర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ప్రతి వేదికపైనా అతడ్ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా ఆయన వెనుక ఉన్న నేతలను కూడా దూరం చేస్తూ ఒంటరిని చేస్తున్నారు.
ఈ పరిణామాలతో చాంద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలిసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గౌరవం ఉండేదని, పార్టీ మారడంతో జనంలో కూడా చులకన య్యానని మదనపడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతుండటం గమనార్హం.
కాగా, కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా 2014 వరకూ టీడీపీలో ఓ సామాన్య కార్యకర్తగా ఉన్నారు. నియోజకవర్గంలో గుర్తింపు పొందిన నేతగా ఎదుగుతున్నా అప్పటికి పెద్ద నేతగా పేరైతే సంపాదించుకోలేదు. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఇటీవల మళ్లీ టిడిపిలో చేరారు చాంద్ బాషా.
అయితే, పార్టీ మారి మళ్లీ టిడిపిలోకి వచ్చిన చాంద్ బాషాకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని తెలుస్తోంది. మే 3న జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో చాంద్పై ఎమ్మెల్సీ పయ్యావులతో పాటు మాజీ ఎమ్మెల్యే కందికుంట పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. 'మేము పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ మారలేదు. కొందరు రెండేళ్లు కూడా ఉండలేకపోతున్నారని' కేశవ్ విమర్శించారు.
అంతటితో ఆగకుండా మే 23న కళ్యాణదుర్గంలో జరిగిన మినీమహానాడులోనూ టార్గెట్ చేశారు. పార్టీలు మారే నేతలు పొద్దు తిరుగుడు పువ్వుల లాంటివారని, వారితో కొంత జాగ్రత్తగా ఉండాలని అధిష్టానానికి సూచించారు. వారి వల్ల పార్టీకి నష్టమే తప్ప.. లాభం ఉండే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, పార్టీ కోసం పనిచేసిన వారిని మరచిపోమని పరోక్షంగా చాంద్ను ఉద్దేశించి అన్నారు.
కాగా, కందికుంట.. పరిటాల వర్గీయుడు. పరిటాల వర్గానికి, కేశవ్ వర్గానికి విభేదాలున్న విషయం తెలిసిందే. అయినా కేశవ్ ప్రతిసారీ ఇలా దించడాన్ని చూస్తే చాంద్ రాకను టీడీపీలో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. ఇదే వేదికపై కందికుంట మాట్లాడుతూ.. 'ఒకే ఒరలో రెండుకత్తులు ఇమడలేవు. తుప్పుపట్టిన కత్తి అయితే ఇమిడేందుకు అవకాశం ఉంటుందేమో. కానీ నేను యుద్ధం చేసే కత్తిగా ఉండాలనుకుంటున్నా'నంటూ నేరుగా చాంద్తో కలవలేనని తేల్చేశారు.
ఈ మాటలతో చిన్నబోయిన చాంద్ అర్ధంతరంగా మహానాడు నుంచి వెనుదిరిగారు. చాంద్ వెళ్లిపోతుంటే వేదికపై ఉన్న వారు ఎవరూ ఆపకపోవడం గమనార్హం. మరోవైపు చాంద్ ముఖ్య అనుచరుడు కేఎం బాషాను కందికుంట తనవైపు లాగేసుకున్నారు. మరికొంతమంది అనుచరులు కూడా కందికుంట పంచన చేరడంతో చాంద్ బాషా ఏకాకిగా మిగిలిపోయారని విశ్లేషకులు చెబుతున్నారు.