విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత- అధిష్టానం ప్రకటన- నెగ్గిన పంతం
ఆసక్తికరంగాసాగుతున్న విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోరులో టీడీపీ ఇవాళ మరో ముందడుగు వేసింది. తమ పార్టీ తరఫన మేయర్ అభ్యర్ధిని ప్రకటించి ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు వేసింది. ఇప్పటికీ అధికార వైసీపీతో పాటు ఇతర పార్టీలు కూడా మేయర్ అభ్యర్ధిని ప్రకటించని పరిస్దితుల్లో టీడీపీ మేయర్ అభ్యర్ధి ప్రకటనతో ముందు వరుసలో నిలిచింది.
విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత పేరును టీడీపీ ఇవాళ ప్రకటించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత. ఇప్పటికే కార్పోరేషన్ ఎన్నికల్లో నగరంలోని 11వ డివిజన్ నుంచి కార్పోరేటర్గా పోటీ చేస్తున్న శ్వేతకు ఇవే తొలి ఎన్నికలు. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు గతంలో జరిగిన పలు ఎన్నికల్లోనూ తండ్రి కేశినేని నాని తరఫున ఆమె వ్యూహరచన చేశారు. ఈసారి ఎన్నికల్లో తొలిసారి కార్పోరేటర్గా బరిలోకి దిగిన శ్వేతకు మేయర్ అభ్యర్ధిగా ప్రకటించి టీడీపీ సాహసం చేసిందనే చెప్పాలి.
విజయవాడ కార్పోరేషన్ బరిలో తొలిసారి పోటీ చేస్తున్న కేశినేని శ్వేతకు తండ్రి రాజకీయ అనుభవమే పెద్ద ప్లస్ పాయింట్. అంతే కాదు గతంలో తండ్రి విజయాలకు తెరవెనుక వ్యూహరచనతో పాటు ప్రత్యక్షంగానూ ప్రచారం చేసిన అనుభవం శ్వేతకు ఉంది. తండ్రితో పాటు ఇతర టీడీపీ అభ్యర్ధుల తరఫున వారి గెలుపు కోసం శ్వేత ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం శ్వేత మేయర్ అభ్యర్ధిత్వంపై టీడీపీనే పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధినేత చంద్రబాబు మాత్రం ఆమె వైపే మొగ్గు చూపారు. మేయర్గా శ్వేత పేరును అధికారికంగా ప్రకటించడం ఎన్నికల్లో ఆమెకు ప్లస్ పాయింట్ కానుంది.