కన్నబాబుకు టిడిపి బుజ్జగింపులు;చంద్రబాబులో మార్పు కోసం ఆమరణ దీక్ష:శివరావు
Recommended Video
విశాఖపట్నం:తాను వైసిపిలో చేరుతున్నట్లు యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ప్రకటన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఆయనను బుజ్జగించేందుకు యుద్దప్రాతిపదికన యత్నాలు ఆరంభించింది. హుటాహుటిన మంత్రి గంటా శ్రీనివాసరావును కన్నబాబు వద్దకు పంపి చర్చలకు కూర్చోబెట్టింది.
ఈ సందర్భంగా టీడీపీలోనే కొనసాగాలని కన్నబాబును మంత్రి గంటా శ్రీనివాస్ కోరారు. మీ ఆవేదనకు కారణాలు తెలిపితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలియబరుస్తానని కన్నబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని, తనకు అన్యాయం జరిగిందని అందువల్లనే తాను పార్టీ మారుతున్నట్లు కన్నబాబు స్పష్టంగా తెలియచెప్పినట్లు సమాచారం.
యలమంచలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు(అసలు పేరు యువి రమణ మూర్తి రాజు) గతంలో ఒకసారి పార్టీ మారాలని నిర్ణయించుకున్నప్పుడు మంత్రి గంటా శ్రీనివాసరావు బుజ్జగింపుతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం తాను వైసీపీలో చేరడం ఖాయమని, దేవుడు దిగివచ్చి చెప్పినా వెనక్కితగ్గేది లేదని కూడా మంత్రి గంటాకు కన్న బాబు ఖరాకండిగా తేల్చి చెప్పేసినట్లు తెలిసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం పోరాటంలో భాగంగా టిడిపి రాజ్యసభ, లోక్సభ ఎంపీలు రాజీనామా చేయాలని, ఆ విధంగా వారిని చంద్రబాబు ఆదేశించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు అన్నాహజారై జట్టు తమిళనాడు సభ్యుడు శివరావు తెలిపారు. తమ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించేవిధంగా చంద్రబాబు మనస్సు మారాలని గాంధేయవాద పద్ధతుల్లో ఈ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నానని శివరావు వివరించారు. విజయవాడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.