జడ్జీ రామకృష్ణ సోదరుడిపై దాడి: నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ..
జడ్జీ రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కలకలం రేపింది. అయితే దాడి చేసింది వైసీపీ శ్రేణులేనని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే దీనిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. మదనపల్లెలో చికిత్స పొందుతున్న రామచంద్రను నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరామర్శించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో 152కి పైగా దాడులు జరిగాయని అన్నారు. జడ్జీ కుటుంబ సభ్యులనే వేధిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై కొందరు దుండగులు ఆదివారం దాడిచేశారు. బి.కొత్తకోట మండలం సూరపవారిపల్లెకు చెందిన కుమార్, ఆయన అనుచరులు కలసి తనపై దాడిచేశారని రామచంద్ర తెలిపారు. బి.కొత్తకోట బస్టాండులో పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్ గల కారులో వచ్చి.. దాడిచేశారన్నారు. వారితో తనకు గతంలో ఎలాంటి గొడవలు లేవని చెప్పారు.
తీవ్రంగా గాయపడిన రామచంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు, తమ కుటుంబానికి మధ్య ఇటీవల జరుగుతున్న భూవివాదాలే దాడికి కారణమని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ నాయకులు తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు.