బూట్లు నాకేదీ నీవే, చంద్రబాబు గురించి కేటీఆరే చెప్పారు: కేసీఆర్పై టీడీపీ ఎదురుదాడి
అమరావతి: తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంపై ఏపీ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. మంత్రులు నక్కా ఆనంద బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్లు నిప్పులు చెరిగారు.
'లోకసభ' సీన్ రివర్స్, చంద్రబాబుకు భారీ దెబ్బ: ఏపీలో జగన్ పార్టీకి 21, టీడీపీకి 4 సీట్లే!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలవడంపై విమర్శలు చేయడాన్ని వారు తప్పుబట్టారు. 2004లో ఎవరితో కలిశావని ప్రశ్నించారు. సిగ్గుందా... మనిషివా, కాంగ్రెస్ పార్టీతో అప్పుడు పొత్తు పెట్టుకున్నావని కేసీఆర్పై నిప్పులు చెరిగారు.
సిగ్గులేకుండా, బూట్లు నాకేది నీవే
2009లో దేహీ అంటూ చంద్రబాబు వద్దకు రెండుసార్లు పొత్తు కోసం వచ్చావని కేసీఆర్ పైన మండిపడ్డారు. తెలంగాణ యువతను ఎన్కౌంటర్ చేశామని చెప్పావని, అదే నిజమైతే 2009లో టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నావని ప్రశ్నించారు. ఈ నాలుగున్నరేళ్లలో నీవేం చేశావో చెప్పకుండా, సిగ్గులేకుండా చెప్పుకోలేని స్థితిలో టీడీపీపై విమర్శలు చేస్తున్నావని అన్నారు. మోడీ సంకనాకావా అని చంద్రబాబు అనడం ఏమిటని, బూట్లు నాకేది నీవే అన్నారు.
ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి ఓట్లు అడిగే దిగజారిన రాజకీయాలా?
ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. నాలుగేళ్లు ఏం అభివృద్ధి చేశావో చెప్పకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏమిటన్నారు. మళ్లీ, ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ఓట్లు అడిగే దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
తిడితేనే రాజకీయం అనుకున్నావా?
తిడితేనే కేసీఆర్ రాజకీయం అనుకుంటున్నారా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నీ కంటికి ఆపరేషన్ జరిగితే ప్రపంచ ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ఉందని, నీవు ఢిల్లీకి వెళ్తావని, ఇది నీకు తెలంగాణపై ఉన్న ప్రేమ అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందని భయపడి ప్రజలు ఎన్నుకున్న సమయాన్ని పక్కన పెట్టి ముందస్తుకు వెళ్లావని ధ్వజమెత్తారు.
చంద్రబాబు గురించి కేటీఆర్ కూడా చెప్పారు
మహాకుట్రలో సభ్యుడిగా ఉన్న కేసీఆర్ చంద్రబాబుపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్న అన్నారు. ఒక సీఎం మాట్లాడకూడని పదాలతో చంద్రబాబును విమర్శించడం ఈ కుట్రలో భాగమే అన్నారు. అహంకారంతో తెలంగాణను కేసీఆర్ ఎంత నాశనం చేశారో ప్రజలకు తెలుసునని చెప్పారు. ప్రపంచంలో హైదరాబాద్కి గుర్తింపు తెచ్చింది చంద్రబాబేనని, ఈ విషయాన్ని కేటీఆర్ కూడా గతంలో చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లో కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
కేసీఆర్కు ఓటమి భయం
కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. నోటి దురద ఎక్కువై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యక్తులను కించపరిచేలా మాట్లాడటం కేసీఆర్ నైజమన్నారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కు చంద్రబాబుకు ఉందని చెప్పారు. ఎదురు మాట్లాడిన వారిపై ఐటీ దాడులు చేయించడం బీజేపీ ఆనవాయతీ మారిందన్నారు. ఇలా చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు.