ఏపీ అసెంబ్లీలో పోటాపోటీగా టీడీపీ- పదోవంతుతోనే వైసీపీకి చుక్కలు- సస్పెన్షన్లతో మైలేజ్
ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలం 151. టీడీపీ నుంచి తెచ్చుకున్న మరో నలుగురితో కలుపుకుంటే 155. టీడీపీ బలం 23 అయితే అందులో నలుగురు వైసీపీకి మద్దతిస్తున్నందున అది కాస్తా 19కి పడిపోయింది. ఇందులో ఓ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే అది కాస్తా 15-16కు పడిపోతోంది. అయినా వైసీపీకి ఉన్న బలంలో పదో వంతు సభ్యుల బలం మాత్రమే కలిగిన టీడీపీ అధికార పార్టీని పలు విషయాల్లో ఇరుకునపెడుతోంది. చివరికి ఈ వ్యవహారం సస్పెన్షన్ల వరకూ వెళ్లడంతో అంతిమంగా అది ఏకైక విపక్షం టీడీపీకి భారీ మైలేజ్ తెచ్చిపెడుతోంది.
Recommended Video
ఏపీ అసెంబ్లీలో టీడీపీ పోరాటం...
దేశంలోని చాలా రాష్ట్రాల్లో శాసనసభల్లో అదికార పక్షంతో దాదాపు సమానంగా బలం ఉన్న విపక్షాలు కూడా కీలకమైన అంశాల్లో పోరాడలేక చేతులెత్తేస్తున్నాయి. అధికారం చేతిలో ఉన్న వారే ఏదైనా చేయగలరన్న వాతావరణం చాలా చట్టసభల్లో కనిపిస్తోంది. కానీ ఏపీ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ అధికార వైసీపీ బలం అధికారికంగా, అనధికారికంగా చూసుకున్నా151-155 గా ఉంది. కానీ విపక్ష టీడీపీ బలం మాత్రం కేవలం 19 మాత్రమే. అంటే దాదాపు 9 నుంచి 10 శాతం మాత్రమే. ఇలాంటి పరిస్దితుల్లో ఏ విపక్షమైనా అధికార పక్షంతో పోరాడలేక చేతులెత్తేసే పరిస్ధితే ఉంటుంది. కానీ ఇక్కడ టీడీపీ మాత్రం అలా వదిలేయడం లేదు. దీంతో బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు బలహీనంగా కనిపిస్తున్న టీడీపీ చేస్తున్న పోరాటం ఆకట్టుకుంటోంది.
తొలిసారి పోడియం వద్దకెళ్లి సస్పెండైన చంద్రబాబు
మన అసెంబ్లీలో సభ్యుల సస్పెన్షన్లు గతంలో ఉన్నవే. ఇప్పుడూ కొనసాగుతున్నవే. కానీ నిన్న ఓ ఘటన మాత్రం టీడీపీతో పాటు అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి జరిగింది. అది చంద్రబాబు పోడియం వద్దకు నిరసనకు దిగి సస్పెన్షన్ కావడం. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు ఎప్పుడూ తన కెరీర్లో అసెంబ్లీ సమావేశాల్లో పోడియం వద్దకు వెళ్లింది లేదు. సమస్య ఎంత పెద్దదైనా, అధికార పక్షాలు ఎంత ఇబ్బంది పెట్టినా చంద్రబాబు ఎప్పుడూ పోడియం వద్దకు వెళ్లలేదు. తన సీటు దగ్గరి నుంచే నిరసన తెలిపేవారు. మిగతా సభ్యులను ఆందోళన చేసేలా ప్రోత్సహించేవారు. కానీ తొలిసారి చంద్రబాబు పోడియం వద్దకు వెళ్లి కింద కూర్చుని సస్పెండ్ అయ్యారంటే వైసీపీ తీరుని ఆయనెంత సీరియస్గా తీసుకున్నారో అర్ధమవుతోంది.
బదులు తీర్చుకుంటున్న జగన్
చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడేందుకు, కొన్ని ప్రశ్నలు, అభ్యంతరాలు లేవనెత్తేందుకు స్పీకర్లు సమయం ఇవ్వడం పరిపాటి. కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ చంద్రబాబు సూచనలతో జగన్కు మైక్ ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. జగన్ మాట్లాడితే తమ ప్రభుత్వ లోపాలు బయటపడతాయనే భయంతో అప్పటి టీడీపీ సర్కారు వ్యవహరించేది. దీంతో సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని జగన్ వాకౌట్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు తాను అధికారంలోకి రాగానే జగన్ కూడా అదే పని చేస్తున్నారు. అయితే ఇక్కడ స్పీకర్ తమ్మినేని కాస్త లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కీలక సమయాల్లో చంద్రబాబుకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. నిన్న కూడా అదే జరిగింది. కానీ జగన్ అభ్యంతరాలతో చంద్రబాబుకు అవకాశం దక్కినట్లే దక్కి చేజారింది. దీంతో ఆయన తొలిసారి పోడియంలోకి వచ్చి నిరసనకు దిగడం, సస్పెండ్ కావడం చకచకా జరిగిపోయాయి.
అసెంబ్లీలో తడబడుతున్న వైసీపీ
విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పక్షం టీడీపీ మైక్ ఇవ్వడం లేదని నానా గందరగోళం సృష్టించిన వైసీపీ... ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. ముఖ్యంగా కీలక సమస్యలపై టీడీపీ హోమ్వర్క్ చేసి అసెంబ్లీకి వస్తోంది. టీడీపీ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వైసీపీ సూటిగా స్పందించలేకపోతోంది. దీంతో ఎదురుదాడినే అస్త్రంగా మల్చుకోవాల్సిన దుస్దితి. చివరికి వైసీపీకి దాదాపు 150కి పైగా సభ్యులున్నా కీలక సమస్యలపై విషయ పరిజ్ఢానం, సమయానుకూలంగా స్పందించే పరిస్ధితి లేకపోవడంతో టీడీపీ నుంచి గట్టి సవాళ్లు ఎదుర్కోక తప్పడం లేదు. దీనికి బదులు నేరుగా టీడీపీ ప్రశ్నలకు సమాధానం చెబితే ప్రభుత్వం మీద అపవాదు పడకుండా ఉంటుంది. ఈ దిశగా వైసీపీ హోమ్ వర్క్ చేయక తప్పదు.