అసెంబ్లీలో పోలవరం చర్చ- టీడీపీ కుట్ర విఫలం- పూర్తిచేసి చూపిస్తామన్న మంత్రి అనిల్
పోలవరం ప్రాజెక్టును మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి శంఖుస్ధాపన చేశారని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని మంత్రి అనిల్ తెలిపారు. దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది వైఎస్సేనని ఆయన గుర్తుచేశారు. వైఎస్ హయాంలో నిర్మించిన పోలవరం కుడి కాలువపై రెగ్యులేటర్ పెట్టి పట్టిసీమ నిర్మించామని టీడీపీ గొప్పలు చెప్పుకుందని అనిల్ విమర్శించారు.
Recommended Video
2018లోనే కుడి, ఎడమ కాలువలు కట్టేసి పోలవరం పూర్తయిందని చెప్పాలని టీడీపీ ప్రయత్నించిందని, కానీ అది కాస్తా విఫలమైందని అనిల్ గుర్తుచేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామంటూ మరో ప్రచారానికి తెర దీశారని, కానీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు నిన్న అక్కడ పర్యటించి ఎత్తు తగ్గించే ప్రశ్నే లేదని క్లారిటీ ఇచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తుందంటూ కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి అనిల్ విమర్శించారు.
సీఎం జగన్కు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని, 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి 2022 ఖరీఫ్ సీజన్ కల్లా రైతులకు నీటిని ఇవ్వబోతున్నామని మంత్రి అనిల్ ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తి చేసి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని, ప్రాజెక్టు ఎత్తు కూడా తగ్గించే సమస్యే లేదని అనిల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే అంచనా వ్యయం తమ హయాంలోనే తగ్గిపోయిందని టీడీపీ చెప్పుకోవడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. ఇప్పటికే ప్రధానికి పోలవరం ప్రాజెక్టు ఖర్చు విషయంలో సీఎం జగన్ లేఖ రాసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
వారం వారం పోలవరం పేరుతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు 8 శంఖుస్ధాపనలు చేయడమేంటో తనకు అర్ధం కావడం లేదని మంత్రి అనిల్ అన్నారు. మధ్యలో తన మనవడితో కలిసి కూడా శంఖుస్ధాపనలు చేశారని చంద్రబాబును ఉద్దేశించి మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు కూడా 8 సార్లు శంఖుస్ధాపన జరగలేదన్నారు.