టీటీడీ నిరర్ధక ఆస్తుల అమ్మకం టీడీపీ నిర్వాకమా?: పాలక మండలి ఏం చెబుతోంది?
అమరావతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల శ్రీవారికి ఆలయానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. శ్రీవారి ఆలయానికి భక్తులు విరాళాల రూపంలో ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన స్థిరాస్తులను విక్రయించడానికి వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని టీటీడీ పాలక మండలి చేస్తోన్న ప్రయత్నాలు భగభగలను సృష్టిస్తున్నాయి. నడి వేసవిలో ప్రచండ భానుడి నుంచి వెలువడే ఉష్ణోగ్రతకు రెట్టింపు స్థాయిలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.
రాజకీయ దుమారం
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్ధక ఆస్తుల విక్రయాల పట్ల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల నాయకులు విమర్శల తీవ్రతను పెంచారు. పదునైన ఆరోపణలను సంధిస్తున్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి డిఫెన్స్లో పడింది. వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలను చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన తీర్మానాలను తాము అనుసరించాల్సి వస్తోందనీ చెబుతోంది.
అన్యాక్రాంతమౌతున్నాయంటూ..
తమిళనాడులో తిరుమలకు చెందిన నిరర్ధక ఆస్తులను విక్రయించాలంటూ టీటీడీ పాలక మండలి ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తమిళనాడులో అన్యాక్రాంతమౌతోన్న శ్రీవారి స్థిరాస్తులను విక్రయించడానికి ఆన్లైన్ ద్వారా వేలంపాటలను నిర్వహించడానికి ప్రతిపాదనలను రూపొందించింది. నిరర్ధకంగా ఉన్నాయంటూ తమిళనాడులో మొత్తం 23 ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్లను విక్రయానికి ఉంచబోతోంది.
తమిళనాడులోని పది జిల్లాల్లో..
తిరువణ్ణామలై, తిరుచిరాపల్లి, తిరుచ్చి, తిరువళ్లూరు, ధర్మపురి, విల్లుపురం, కంచి, కోయంబత్తూరు, వెలూరు, నాగపట్టణం జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నట్లు గుర్తించింది. ఎనిమిది మంది అధికారులతో రెండు కమిటీలను నియమించింది. వాటి రిజిస్ట్రేషన్ బాధ్యతలను కూడా వారికే అప్పగించింది. ఆయా ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించింది.
రూ.200 కోట్లు..
శ్రీవారి స్థిరాస్తులను విక్రయించడం ద్వారా కనీసం 200 కోట్ల రూపాయలను ఆర్జించాలనేది టీటీడీ ప్రణాళిక. ఈ మొత్తాన్ని తిరుమల ఖజానాలో చేర్చుతారు.ఎనిమిది మంది అధికారులతో రెండు కమిటీలను నియమించింది. వాటి రిజిస్ట్రేషన్ బాధ్యతలను కూడా వారికే అప్పగించింది. ఆయా ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించింది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఓ తీర్మానాన్ని రూపొందించింది.
రాజకీయ దుమారానికి..
శ్రీవారి ఆస్తులను విక్రయించడానికి టీటీడీ సిద్ధం కావడంతో రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ ఆస్తులను కాపాడలేని ప్రభుత్వానికి పరిపాలన కొనసాగించే హక్కు లేదని విమర్శిస్తున్నారు. వెంకన్నకి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే హక్కు ఉన్న దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగి ఉందనే అనుమానం ఉందని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
టీటీడీ ఏం చెబుతుంది?
నిరర్ధక ఆస్తుల విక్రయం కొత్తేమీ కాదని టీటీడీ చెబుతోంది. 1990లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు తాము నిరర్ధక ఆస్తులను విక్రయించడానికి పూనుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. దేవస్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయని చెప్పారు. బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, దేవస్థానం నిరర్థక ఆస్తుల అమ్మకం ప్రక్రియ 1974 నుంచి కొనసాగుతోందని వివరణ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్గా ఉన్న సమయంలో టీటీడీ పాలకమండలి 2015లో ఈ దిశగా ఓ తీర్మానం కూడా చేసిందని గుర్తు చేశారు.