డాక్టర్ సుధాకర్ను పిచ్చివాడిగా: మేం ఎప్పుడో చెప్పాం: ఎన్నాళ్లీ కుట్రలు?: టీడీపీ, బీజేపీ
అమరావతి: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియనిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కుట్రకోణం ఉందంటూ సీబీఐ చేసిన దర్యాప్తు పట్ల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వేర్వేరుగా స్పందించారు. సీబీఐ దర్యాప్తుతోనే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తాము ఆశించామని, దర్యాప్తు అదే రీతిన సాగుతోందని వ్యాఖ్యానించారు. కుట్ర కోణాన్ని ఛేదించి, అసలు దోషులు అరెస్టు అయ్యేలా చూడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
Recommended Video
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ను పిచ్చివాడిగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయనే విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్బ్యురో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. తాము మొర పెట్టుకున్నప్పటికీ..వినిపించుకోలేదని అన్నారు. డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందనే విషయాన్ని సీబీఐ సైతం స్పష్టం చేసిందని, ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టుకూ వివరించిందని గుర్తు చేశారు.
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, ప్రభుత్వం సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు సజావుగా సాగనివ్వాలని, అసలు ముద్దాయిలు అరెస్టు అయ్యేలా చూడాలని చెప్పారు. దళితులపై ఎన్నాళ్లీ కుట్రలు.. ఎన్నేళ్లీ కుట్రలు అంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందంటూ సీబీఐ ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయడానికి తమకు సమయం కావాలని సీబీఐ అధికారులు హైకోర్టును కోరారని, దీన్ని బట్టి చూస్తే.. కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కుట్ర చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ, తెలుగుదేశం పరస్పరం ఆరోపణలను గుప్పించుకుంటున్నారని చెప్పారు. డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం అంటే..మాస్కుల అంశం కాదా? అనే సందేహాన్ని విష్ణువర్ధన్ రెడ్డి లేవనెత్తారు.