జగన్ సర్కార్పై రంగుల దాడి: సలహాదారులు ఏ కలుగులో దాక్కున్నారంటూ సెటైర్లు
అమరావతి: గ్రామీణస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగుల వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి ఎదురుదెబ్బలను తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. వైఎస్ జగన్ అనుభవరాహిత్యం వల్లే ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న సలహాదారులు, ఆయన కోటరీ పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా గ్రామీణ స్థాయిలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు వేసిన రంగులన్నింటినీ తొలగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్వరరావు బెంచ్ బుధవారం జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని తొలగించడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇప్పటిదాకా పాటించకపోవడాన్ని కోర్టు ధిక్కరణ కిందికి తీసుకుంటామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలకు దిగారు.
వైఎస్ జగన్కు రంగుల పిచ్చి పట్టుకోవడానికి ప్రధాన కారణం సలహాదారులేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొలిట్బ్యురో సభ్యుడు వర్ల రామయ్య, బీజేపీ కర్నూలు జిల్లా నాయకుడు డాక్టర్ బైరెడ్డి శబరి రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి విషయాన్ని హైకోర్టు తప్పు పట్టిందని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో హైకోర్టు నుంచి ఇన్ని ప్రతికూల తీర్పులు, ఆదేశాలను ఎదుర్కొనలేదని అన్నారు.
జగన్ అనుభవరాహిత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలు కావడం వల్లే న్యాయస్థానాలు తప్పుపడుతున్నాయని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారని, ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్ చేయడానికి ఏ కోర్టు మిగల్లేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులను వేయడం అనేది తాను ఎక్కడా చూడలదేని అన్నారు. కోట్ల రూపాయల జీతాలను అందుకుంటోన్న సలహాదారులు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారని నిలదీశారు.
Recommended Video
ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బైరెడ్డి శబరి రెడ్డి ప్రశ్నించారు. ఇదే విషయంపై హైకోర్టుతో, నేడు సుప్రీంకోర్టుతో చీవాట్లు తింటున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఈ రంగుల పిచ్చి ఎందుకు పట్టిందో అర్థం కావట్లేదని అన్నారు. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి, లక్షల రూపాయల జీతాలను ఇచ్చి నియమించుకున్న సలహాదారులు ఇస్తోన్న పనికిమాలిన సలహాల్లో ఇదీ ఒకటి అని శబరి రెడ్డి ఘాటుగా విమర్శించారు.