అగ్రిగోల్డ్ షాక్: 'వైసీపీ వల్లే జీ గ్రూప్ వెనక్కి, త్వరలో సంచలన విషయాలు, పవన్ కళ్యాణ్ చెప్పారుగా'
అమరావతి: అగ్రిగోల్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు వ్యవహారంలో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ను టేకోవర్ చేసుకుంటామని చెప్పిన జీ గ్రూప్ ఆ తర్వాత వెనక్కి తగ్గింది.
అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు: చేతులెత్తేసిన జీ గ్రూప్, తెరపైకి ఎస్పీ నేత
ఆస్తుల కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము తీసుకోమని ఇటీవల హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీంతో అగ్రిగోల్డ్ వ్యవహారం మళ్లీ మొదటకు వచ్చింది. దీనిపై కుటుంబ రావు ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎస్సెల్ గ్రూప్ వెనక్కి తగ్గడానికి వైసీపీ కారణమని ఆరోపించారు.
వైసీపీ వల్లే అగ్రిగోల్డ్ డీల్ చెడిపోయింది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపుల వల్లే అగ్రిగోల్డ్ డీల్ చెడిపోయిందని కుటుంబ రావు ఆరోపించారు. ఆయన పరోక్షంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిని తప్పుబట్టారు. దీనికి వారే కారణం అన్నారు. సీబీఐ కేసులు అంటూ జీ గ్రూప్ను భయపెట్టారని చెప్పారు. అందువల్లే మళ్లీ మొదటకు వచ్చిందన్నారు.
సరైన సమయంలో ఆధారాలు బయటపెడతాం
జీఎస్సెల్ గ్రూప్ ప్రతినిధులే ఈ విషయాన్ని చెబుతున్నారని కుటుంబ రావు అన్నారు. అయితే, ప్రస్తుతానికి ఆ పేర్లను తాము బయటపెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాము సరైన సమయంలో ఆధారాలు బయటపెడతామని చెప్పారు. త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.
సంచలన విషయాలు బయటపెడతాం
త్వరలో ఈ డీల్ చెడిపోవడానికి గల సంచలన విషయాలు బయటపెడతామని కుటుంబ రావు వ్యాఖ్యానించారు. 18 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగులుతుందన్నారు. విపక్షాలది రాక్షస క్రీడ అని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ చెప్పారుగా
వైసీపీ వల్ల ముందుకొచ్చిన జీఎస్సెల్ గ్రూప్ వెనక్కి పోయిందని కుటుంబ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారానికి పరిష్కారం చూపిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.