కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ని మూట కట్టి వైసీపీ లోకి కలుపుతాడు :బుద్ధా వెంకన్న
విజయవాడ:ప్రత్యర్థి పార్టీల నేతలపై పదునైన విమర్శలతో విరుచుకు పడే టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శల దాడి చేస్తున్నా ఆయన తాజాగా మరో సారి కన్నాపై పలు ఆరోపణాస్త్రాలను సంధించాడు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్కు ఏజెంట్ అని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ సూచనల ప్రకారమే సీఎం చంద్రబాబుపై కన్నా అవినీతి మరకలంటించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని అక్రమాలు జరిగాయో ప్రజలకు తెలుసునని బుద్ధా వెంకన్న అన్నారు.
రాష్ట్ర ప్రజల కోసమే కేంద్రంపై సీఎం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని, అలాంటి చంద్రబాబుని కన్నా దురుద్దేశ్యంతో లక్ష్యంగా చేసుకొని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని బుద్ధా వెంకన్న చెప్పారు.
హెరిటేజ్ కంపెనీ పై కేసు వేసిన సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కు కోర్టు మొట్టికాయలు వేసిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నా సంపాదించిన ఆస్తులపై ఆయనే సీబీఐ విచారణ కోరాలని బుద్దా డిమాండ్ చేశారు.
టీడీపీ చంద్రబాబు కు అద్దె ఇల్లు అని కన్నా విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ని మూట కట్టి వైసీపీ లోకి కలుపుతాడని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. అలాంటి కన్నా బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామనడం విడ్డురంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు.