కన్నా లక్ష్మీనారాయణ దెబ్బకు ఏపీలో బీజేపీ ఖాళీ: నిధులపై పురంధేశ్వరికి టీడీపీ కౌంటర్
విజయవాడ: బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి, ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న సోమవారం కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుండుసన్నా మాత్రమే వస్తుందని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: బాబుపై 'వ్యూహం' బెడిసికొట్టడంతో జగన్వైపు అడుగులు వేస్తున్నారా?
నిధులు ఇవ్వకుండా అసత్య ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులు కేటాయించడం లేదని బుద్ధా ఆరోపించారు. నిధులు ఇవ్వకపోగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఏపీకి నిధుల విడుదలపై చర్చకు రావాలని సవాల్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణకు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయో, ఇప్పుడు ఎంతక ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
కన్నా దెబ్బకు ఏపీలో బీజేపీ ఖాళీ
కన్నా లక్ష్మీనారాయణ దెబ్బకు ఏపీలో బీజేపీ ఖాళీ అయిపోతోందని బుద్ధా విమర్శించారు. ఎన్నికలకు మరో వంద రోజులు ఉండగానే బీజేపీని చాలామంది విడిచిపెట్టారని చెప్పారు. ఎన్నికల నాటికి బీజేపీలో కన్నా నాయకత్వంలో ఉండేది గుండుసున్నా అన్నారు. ఏపీకి కేంద్రం నిధులు కేటాయించడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ విమర్శలు సరికాదన్నారు. రాబోయే టీడీపీ ఘన విజయం ఖాయమని చెప్పారు. అంతకుముందు బీజేపీ సమావేశంలో పురంధేశ్వరి, కన్నాలు మాట్లాడారు.
చంద్రబాబుపై పురంధేశ్వరి విమర్శలు
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కాకుండా ప్రజాసేవకుడిగా ఉన్నారని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్ర పథకాల వల్లనే అందరికీ సంక్షేమం అందుతోందని చెప్పారు. జీఎస్టీ (వస్తు సేవల పన్ను) అమలు చేయడం వల్ల వస్తువులు తక్కువ ధరకే వస్తున్నాయని చెప్పారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తద్వారా తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. నవ్యాంధ్రలో పాలన పూర్తిగా అవినీతిమయమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును తానే కట్టేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి (చంద్రబాబు నాయుడు) చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేవలం రూ.4 వేల కోట్లు రాలేదని తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు. అగ్రవర్ణాల్లో పేదల కోసం ఎవరు ఊహించని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్లను ప్రవేశ పెట్టారని పురంధేశ్వరి అన్నారు. అగ్రవర్ణాల్లో పేదల కోసం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ప్రతి స్కీమ్ను ఒక స్కామ్గా చంద్రబాబు మార్చేశారన్నారు. ఏపీలో ప్రజలు నీతి నిజాయితీతో కూడిన పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీలో చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లే విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరం లేదని చెప్పారు. ఉదయం లేచింది మొదలు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ జపం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులు దోచుకుంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబుతో కలిసి ఉన్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటికి చంద్రబాబును అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. నిత్యం బీజేపీని, మోడీని విమర్శించడాన్ని ఉద్దేశిస్తూ ఆయన అలా మాట్లాడారు.