బుల్లెట్ గుండె ఎవరిదని చూడదు: పవన్కు టీడీపీ హెచ్చరిక, మోడీ-రాహుల్లపై పీపుల్స్స్టార్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉండవల్లిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తే పోరాటం చేయాలని, అవసరమైతే ఈ పోరాటంలో తాను ముందుంటానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
మీ వల్ల నష్టపోతున్నాం: పవన్కు రైతుల ఝలక్, జగన్లా చేయనని హామీ
రాజధాని ప్రాంతంలో రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు, మంత్రులు సోమవారం నాడు ఆయనపై వరుసగా విరిచుకుపడుతున్నారు. కళా వెంకట్రావు, జూపూడి ప్రభాకర రావు, మంత్రులు నారాయణ, నక్కా ఆనంద బాబు తదితరులు విమర్శలు గుప్పించారు.
వైసీపీ పాత్ర లేనేలేదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్ ఎందుకు నిర్వహిస్తుందో అర్థం కావడం లేదని మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. అవిశ్వాసంలో వైసీపీ పాత్ర లేనే లేదన్నారు. బంద్ నిర్వహిస్తే రాష్ట్ర ప్రజలకే నష్టమనే విషయం తెలియదా అన్నారు. వైసీపీఉచ్చులో పడింది టీడీపీ కాదని, బీజేపీయేనని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
బుల్లెట్లు ఎవరు కురిపిస్తున్నారని
రాజధాని అమరావతి ప్రాంతంలోని 98 శాతం మంది రైతులు ఇష్టంతోనే భూములు ఇచ్చారని నక్కా ఆనంద్ బాబు చెప్పారు. మీ భూములు బలవంతంగా తీసుకుంటే నా గుండె అడ్డుపెడతానని పవన్ చెబుతున్నారని, అసలు ఆయన గుండె అడ్డుపెట్టడానికి ఇక్కడ బుల్లెట్లు ఎవరు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తుపాకీ గుండు ఎవరి గుండె అని చూడదు
పవన్ కళ్యాణ్, జగన్లు జోడెద్దుల్లా తయారయ్యారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు అన్నారు. తుపాకీ గుండు ఎవరి గుండె అని చూడదని హెచ్చరించారు. రేపటి వైసీపీ బంద్ అనాలోచిత ఆలోచన అన్నారు. అహంకారంతో వ్యవహరించిన నేతలు పతనమయ్యారని మండిపడ్డారు.
బీజేపీ పంజరంలో చిక్కుకున్న ట్విట్టర్ పిట్ట
పవన్ కళ్యాణ్ బీజేపీ పంజరంలో చిక్కుకున్న ట్విట్టర్ పిట్టలా మారారని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రాజధాని కోసం 33వేల ఎకరాలను రైతులు త్యాగం చేస్తే, బలవంతంగా లాక్కున్నారంటూ వారి మనసుల్లో విషం నింపేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు.
మోడీ, రాహుల్ గాంధీలపై నారాయణ మూర్తి
ఇదిలా ఉండగా, విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో సినీ నటుడు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. హోదా ఇస్తానని మాట తప్పిన మోడీ, ఆడిన మాట తప్పకుండా ఇచ్చి జన్మసార్థకం చేసుకోవాలని సూచించారు. దేవాలయం వంటి పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు.