టీడీపీ బంపర్ ఆఫర్ : పార్టీ మారినందుకు.. ఆ ఎమ్మెల్యే పంట పండినట్టేనా..!
అనంతపురం : వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ మారడం వరకు బాగానే ఉంది. కానీ, అప్పటికే టీడీపీలో కొనసాగుతోన్న పార్టీ నేతలతో ఇంటి పోరు తప్పని పరిస్థితి. ఓవైపు సొంతగూటి నేతలతోనే పొసగడం లేదన్న చర్చ జరుగుతున్న సమయంలో, అదే ఎమ్మెల్మేకు ఇప్పుడు మంత్రి పదవి రాబోతుందంటూ తెర మీదికి ఊహగానాలు.
ఇందులో నిజానిజాలెంతో తెలియదు గానీ కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు త్వరలోనే మంత్రి పదవి కట్టబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ అనంతపురం రాజకీయాల్లో ఊపందుకుంది. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఆయనకు మైనారిటీ శాఖను అప్పగించాలనే యోచనలో ఉన్నాయట ప్రభుత్వ వర్గాలు.
ఇదిలా ఉంటే, వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యే అత్తార్ బాషాను తొలి నుంచి కదిరి పార్టీ ఇంఛార్జీ కందికుంట వెంకటప్రసాద్ వర్గీయులు వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో జరిగే ఏ పార్టీ కార్యక్రమంలోను ఆయన ఊసే ఉండడం లేదు. దీనికి వెంకటప్రసాద్ అనుచరుల నుంచి వస్తున్న బెదిరింపులు ఒక కారణమైతే, కార్యక్రమాలకు వెళ్లి అవమానాల పాలవడం కంటే దూరంగా ఉండడమే బెటర్ అన్న ఆలోచనలో అత్తార్ బాషా ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇలా కదిరి నియోజకవర్గ రాజకీయాలు అత్తార్ బాషా, వెంకటప్రసాద్ ల మధ్య రెండు గ్రూపులుగా చీలిపోయి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే అత్తార్ బాషాకు మంత్రి పదవి వస్తుందన్న ఊహగానాలు వినిపించడం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మైనారిటీ శాఖను పల్లె రఘునాథ్ పర్యవేక్షిస్తున్నారు. జలీల్ ఖాన్, షరీఫ్ అహ్మద్ వంటి వైసీపీ నుంచే పార్టీలోకి వచ్చిన మైనారిటీ నేతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అత్తార్ బాషా వైపే మొగ్గు చూపడం గమనార్హం.
గతంలొ టీడీపీలోనే మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అత్తార్ బాషా పార్టీ నుంచి 2009,2014 లో టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో అదే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆఫర్ రావడంతో అందిపుచ్చుకున్న ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏదేమైనా.. మంత్రి పదవి దక్కబోతుందన్న విషయం అత్తార్ బాషాకు ఆనందాన్నిచ్చేదైతే.. దీనిపట్ల వ్యతిరేక వర్గమైన వెంకటప్రసాద్ వర్గీయుల రియాక్షన్ ఎలా ఉండబోతందా..! అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.