వైసీపీ నేత కిడ్నాప్: ఎమ్మెల్సీ పర్వంలో టీడీపీ 'ఎటాక్', చితకబాదారు..
వైసీపీకి చెందిన పెద్దమండ్యం ఎంపీపీ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం కోసం కలెక్టరేట్ వద్దకు వచ్చిన సమయంలో.. ఆయన్ను గేటు వద్దే టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు.
చిత్తూరు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ వారిని నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
నామినేషన్ వేయడానికి వచ్చిన వైసీపీ నేతను టీడీపీ నేతలు ఏకంగా కిడ్నాప్ చేయడంతో విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి చెందిన పెద్దమండ్యం ఎంపీపీ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం కోసం కలెక్టరేట్ వద్దకు వచ్చిన సమయంలో.. ఆయన్ను గేటు వద్దే టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు.
సాయంత్రం వరకు ప్రసాద్ రెడ్డి ఆచూకీ తెలియకుండా వారు జాగ్రత్తపడ్డారు. ఈ ఘటన మంగళవారం నాడు 12.10గం. కు జరగ్గా.. కేవం రెండవ గేటు ద్వారానే పోలీసులు నేతల రాకపోకలకు అనుమతించారు. ఆ తర్వాత 1.40గం.ల సమయంలో వెదురుకుప్పం జడ్పీటీసీ మాధవరావు ఎమ్మెల్సీ నామినేషన్ వేసేందుకు బయలుదేరారు.
ఇందుకోసం తొలుత ఆయన కలెక్టరేట్ కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి రిటర్నింగ్ అధికారైన జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేశారు. తనపై టీడీపీ నేతలు దాడికి పాల్పడే అవకాశమున్నందునా.. తనకు రక్షణ కల్పించాల్సిందిగా మాధవరావు రిటర్నింగ్ అధికారిని కోరారు.
దీంతో జాయింట్ కలెక్టర్ ఎస్పీకి సమాచారమిచ్చి మాధవరావుకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు రక్షక్ వాహనంలో వచ్చి ఆయన్ను కలెక్టరేట్ వద్దకు తీసుకెళ్లారు. పోలీసులు రక్షణగా ఉన్నా.. కలెక్టరేట్ గేటు వద్ద వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు మాధవరావుపై దాడికి పాల్పడ్డారు. వాహనం తాళాలు లాక్కుని, మాధవరావు కూర్చున్న వైపు వాహనం అద్దాలు పగలగొట్టారు. నామినేషన్ పత్రాలు బలవంతంగా లాగేసుకున్నారు.
టీడీపీ కార్యకర్తల దౌర్జన్యంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దాడికి పాల్పడ్డవారిని చెదరగొట్టారు. ఒక సెట్ పత్రాలను టీడీపీ కార్యకర్తలు లాక్కుపోగా.. అంతకుముందే మాధవరావు జాగ్రత్తపడ్డారు. తన చొక్కా లోపల మరో సెట్ పత్రాలను దాచుకున్న ఆయన.. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టాక నామినేషన్ దాఖలు చేశారు. అయితే అఫిడవిట్ ను టీడీపీ నేతలు లాగేసుకున్నారని, రిటర్నింగ్ అధికారికి, పర్యవేక్షక అధికారికి ఫిర్యాదు చేశారు.
సానుకూలంగా స్పందించిన అధికారులు మరో అఫిడవిట్ తయారుచేసుకుని వచ్చేందుకు అనుమతించారు. టీడీపీ కార్యకర్తలు తన సెల్ ఫోన్, ఏటీఎం కార్డు సైతం లాగేసుకున్నారని మాధవరావు ఆరోపించడం గమనార్హం.
ఇదే క్రమంలో పెద్దమండ్యం మండలానికి చెందిన మస్తాన్రెడ్డి టీడీపీ కార్యకర్తల భయానికి పలమనేరు బైపాస్ రోడ్డు సమీపంలోని ప్రహరీ గోడ దూకి కలెక్టరేట్ లోనికి వచ్చారు. అంతకుముందు గౌరయ్య అనే పీలేరుకు చెందిన ఓ చౌకదుకాణ డీలరు కలెక్టరేట్ వద్దకు వచ్చాడు.
అయితే అతను ఈ పాస్ యంత్రం మరమ్మత్తు కోసం కలెక్టరేట్ కు రాగా, నామినేషన్ కోసమే వచ్చాడని భావించిన టీడీపీ శ్రేణులు అతనిపై దాడికి పాల్పడ్డారు. తాను డీలర్ అని చెబుతున్నా వినిపించుకోకుండా అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈపాస్ మెషీన్ ను ధ్వంసం చేయడంతో రూ.55వేలు నష్టపోయానని అతను వాపోయాడు.
కొసమెరుపు ఏంటంటే అతనూ టీడీపీ కార్యకర్తే అని చివర్లో తేలింది. దీంతో గౌరయ్య తన పార్టీ సభ్యత్వ కార్డు చూపించి మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి జి.అనంతరాము సైతం ఇలాంటి పరిస్థితులపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం.