పార్టీకి నువ్వు చేసిన డ్యామేజీ చాలు..!గమ్మునుండవో..! అంటూ చింతమనేని పై ఫైర్ అవుతున్న తమ్ముళ్లు..!!
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తనవంతు పాత్ర ఉందని పార్టీ కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు.బాద్యత గల ప్రజాప్రతినిధినన్న ఇంగిత జ్జానం మరిచి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసేకున్నాడు కాబట్టే పార్టీకి తీవ్ర స్ధాయిలో నష్టం జరిగిందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఎమ్యెల్యే స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అదే ప్రజలను దూషించడం, అదికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, దళితుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలు పార్టీ కి శరాఘాతంలా పరిణమించాయని, ఈ అంశాలను పసిగట్టే పరిజ్జానాన్ని చంతమనేని కోల్పోయారని, అందుకే ఘోరంగా ఓడిపోయారని పార్టీ లో చర్చ జరుగుతోంది. ఐతే చింతమనేని అరాచకాలపై వైసీపి ప్రభుత్వం విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.. తప్పులు నిర్దారణ ఐతే శిక్షించేందుకు వెనకాడేది లేదని వేసిపి నేతలు చెప్పుకొస్తున్నారు.
పార్టీకి కనబడకుండా డ్యామేజ్ చేసిన చింతమనేని..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు..!!
ఏపిలో తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానని నేత ఆయన. అతనే చింతమనేని ప్రభాకర్ పరిచయం అక్కర్లేని నేత. తనను తాను అతిగా ఊహించుకుంటూ ఎక్కువ ఆర్భాటం చేసిన మాస్ మహారాజు. పశ్చిమగోదావరి జిల్లాలో తనను మించి మాస్ లీడరు లేడనే ధీమా. పైగా. టీడీపీ అధికారంలోకి రావటానికి తానే కారణమనే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇలా చెప్పేకంటే.. కొల్లేటి తీరంలో మకుటం లేని మహారాజుగా చక్రం తిప్పిన పసుపునేతగా చెప్పాలి. అడ్డగోలుగా సరస్సులో రోడ్డు వేస్తూ.. అడ్డొచ్చిన అటవీశాఖ అధికారులపై తిట్ల దండకం అందుకున్నాడు.
ఒకటి కాదు రెండు కాదు అన్నీ అరాచకాలే..! ప్రభాకర్ పై కార్యకర్తల ప్రకోపం..!!
ఇసుకాసురుడిగా మారి.. ఇష్టానుసారం ఇసుక తవ్వుతుంటే ఇదేమని అడిగిన అప్పటి ఎమ్మార్వో వనజాక్షిని జట్టుపట్టుకుని ట్రాక్టర్ కింద పడేసి తొక్కించేందుకు ప్రయత్నించి ఘనుడు. నడిరోడ్డుపై ఆర్టీసీ డ్రయివర్ను కేవలం చంద్రబాబు ఫొటో సరిగాలేదంటూ చేయి చేసుకున్న ఘనత సాధించిన ఎమ్మెల్యే. అంతకుమించి చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వానికి వీరవిధేయుడు. ప్రభుత్వ విప్ కూడా.. తనకు తానుగా ఓడి పోవాలని భావిస్తే తప్ప ఓటమి తననేమీ చేయదంటూ మొన్నటి ఎన్నికల్లో ప్రగల్భాలు పలికాడు. పనిలో పనిగా వైసీపీ అభ్యర్ధి అబ్బయ్యచౌదరిని ఘోరంగా ఓడిస్తానంటూ మరీ సవాల్ విసిరాడు.
చింతమనేని అదికార అహంకారం..! విచారణ చేపట్టిన అదికార పార్టీ..!!
అయితే.. ఇదంతా మొన్నటి ఓటమితో పటాపంచలైంది. నాటి నుంచి ఇప్పటి వరకూ.. చింతమనేని ప్రభాకర్ ఎక్కడా కనిపించలేదు. పైగా మీడియా ముందు నోరు తెరచిన దాఖాల్లేవు. దెందులూరు తన సొంత అడ్డాగా భావించిన చింతమనేని తాను నీతికి కేరాఫ్ చిరునామాగా పలుమార్లు చెప్పుకొచ్చాడు. కేవలం ప్రజల సమస్యలు తీర్చేందుకు మాత్రమే తాను బూతులు తిట్టడం, అధికారులను బెదిరించటం చేస్తుంటానంటూ గొప్పగా తొడలు కొట్టిన సందర్భాలున్నాయి. అయితే.. వైసీపీ అధికారంలోకి రావటంతో చింతమనేని నీతి ఎంత వరకూ ఉందనే విషయాన్ని కూపీ లాగింది.
చింతమనేనిపై అదికార పార్టీ ఫోకస్..! తప్పులు తేలితే శిక్ష తప్పదంటున్న వైసీపి నేతలు..!!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. రైతులకు చేరాల్సిన పైపులు, పేదలకు అందాల్సిన గేదెలను తన సొంతవారి పేరిట స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. మట్టి, ఇసుకనే గాకుండా నియోజకవర్గంలోని నిరుపేదల కడుపును కూడా కొట్టేంతగా దిగజారటం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదే సందర్బంలో పార్టీకి కనబడకుండా చింతమనేని ప్రభాకర్ పూడ్చలేని నష్టం చేసారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని నోటి దూల వల్ల పార్టీ డ్యామేజ్ అయ్యిందని, దాని ప్రభవం చంద్రబాబు వరకూ పాకిందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇకనైనా చింతమనేని కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండాలని పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి.