చంద్రబాబుపై దాడికి నిరసనగా టీడీపీ భారీ యాక్షన్ ప్లాన్: అమరావతి గ్రామాలు సహా..!
అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విశాఖపట్నం విమానాశ్రయం వద్ద గురువారం చోటు చేసుకున్న దాడి ఘటన పట్ల టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరును ఎండగడుతూ పలు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. వివిధ రూపాల్లో ర్యాలీలు, ధర్నాలను నిర్వహించడానికి సమాయాత్తమౌతున్నారు. రాస్తారోకో, జాతీయ రహదారులను దిగ్బంధనం వంటి ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
Recommended Video
రోజంతా హైడ్రామా.. చివర్లో హైదరాబాద్కు చంద్రబాబు
విజయనగరం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకులు కోడిగుడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం విమానాశ్రయం వద్ద రోజంతా హైడ్రామా కొనసాగింది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ చంద్రబాబు కాన్వాయ్కు వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుపడటం, దాన్ని టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం చంద్రబాబును పోలీసులు హైదరాబాద్కు పంపించడంతో పరిస్థితులు సద్దుమణిగాయి.
మౌన ప్రదర్శనలు.. రాస్తారోకోలు..
చంద్రబాబుపై దాడి చోటు చేసుకుంటున్న సమయంలోనే కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాల్లో టీడీపీ నాయకులు రాస్తారోకోలను నిర్వహించారు. పలుచోట్ల నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అదే తరహా ప్రదర్శనలను శుక్రవారం కూడా కొనసాగించడానికి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మౌన ప్రదర్శనలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
మాజీ మంత్రుల సారథ్యంలో..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రుల సారథ్యంలో జిల్లాలవారీగా నిరసన ప్రదర్శనలకు దిగనున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో పార్టీ సత్తా చూపేలా ఈ ప్రదర్శనలు ఉండాలంటూ గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా నాయకత్వానికి సమాచారం వెళ్లింది. అమరావతి గ్రామాలు సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.