టిడిపి అభ్యర్థులను ముందే ప్రకటిస్తాం: ప్రత్తిపాటి, కావాల్సింది లాభాలు కాదు: అచ్చెన్న
గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని ఆయన తేల్చిచెప్పారు. బుధవారం మంగళగిరిలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులకు సంబంధించి కసరత్తు ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. మరోవైపు ఎపి అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆర్టీసీలో లాభాలు కన్నా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడించారు.
అభ్యర్థుల పేర్లు...ముందే ప్రకటిస్తాం
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు మంత్రి పుల్లారావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ...తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ టిడిపి అభ్యర్థుల పేర్లను కూడా ముందుగానే ప్రకటిస్తామని మంత్రి పుల్లారావు వెల్లడించారు.
సిపిఎస్ రద్దు...సిఎం సానుకూలం
అనంతరం సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని టిడిపి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష పాత్రను కూడా తామే పోషించి వివిధ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు ఎమ్మెల్యే ఆంజనేయులు చెప్పుకొచ్చారు.
లాభాలు కాదు...ప్రజాసేవ ముఖ్యం
ఇదిలావుండగా ఆర్టీసీలో తమకు లాభాలు అక్కర్లేదని...ప్రజల సౌకర్యాలే ముఖ్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎపిఎస్ ఆర్టీసీ విషయమై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త డిపోలు, గ్రామాలకు బస్సులు, రాజధానికి బస్సులు తదిదర అంశాలపై ఎపి అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు 75శాతానికి తీసుకొచ్చామని...ఆక్యుపెన్సీ 85శాతానికి వస్తే నష్టాలు తగ్గుతాయని మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.
అన్ని రూట్లలో...బస్సులు
తాము లాభాల కంటే ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే ముఖ్యమనుకుంటున్నమని పునరుద్ఘాటించారు. అందుకే 60 స్లీపర్ బస్సులను కొనుగోలు చేస్తున్నామని...ఈ నెలలోనే అవి అందుబాటులోకి రానున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే రూ.200 కోట్లతో నూతనంగా పల్లెవెలుగు బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో ఇకపై అన్ని రూట్లలో పల్లెవెలుగు బస్సులు తిప్పుతామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.