గుజరాత్ ఎఫెక్ట్: మిత్రులకు మంచి కాలమేనా, బాబుకు కలిసొచ్చేనా?
Recommended Video
అమరావతి: గుజరాత్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం పట్ల టిడిపి హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గిపోవడంతో ఆత్మ పరిశీలన చేసుకొనేందుకు బిజెపికి అవకాశం దక్కుతోందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఆరో దఫా విజయం సాధించింది. 2012 తో పోలిస్తే గుజరాత్లో బిజెపికి తక్కువ సీట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకొంది. పట్టణ ప్రాంతాల్లో బిజెపి తన పట్టును నిలుపుకొంది.
గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి పట్టును కోల్పోయిందని ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి. బిజెపికి కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనే ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీకి చెందిన టిడిపి నేతలు అంతర్గత సంభాషణల్లో పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
రాజేంద్రప్రసాద్కు షాక్: పార్టీ అనుమతి లేకుండా బిజెపిపై విమర్శలొద్దు: బాబు
బిజెపి ఆత్మపరిశీలనకు అవకాశం
బిజెపి గుజరాత్ రాష్ట్రంలో తక్కువ సీట్లతో విజయం సాధించింది. అయితే ఈ పరిణామాలు బిజెపికి ఆత్మ పరిశీలన చేసుకొనేందకు దోహదపడే అవకాశం ఉందని టిడిపి నేతలు అంతర్గత సంబాషణల్లో అభిప్రాయపడుతున్నారు.గతంలో కంటే ఎందుకు గుజరాత్ రాష్ట్రంలో సీట్లు తగ్గాయనే విషయాన్ని పరిశీలించుకొనే అవకాశం దొరుకుతోందని టిడిపి నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
బిజెపి ఓడిపోతే ఇక్కట్లే
గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఓడిపోతే ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవని టిడిపి నేతలు అభిప్రాయంతో ఉన్నారు.ఈ ఫలితాలు వ్యతిరేకంగా వస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తదుపరి పాలనాకాలం సాఫీగా జరిగేది కాదని, ఇప్పుడు మరో ఏడాదిన్నరపాటు సుస్థిరంగా తన పని తాను చేసుకోవడానికి అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. ‘ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఓటమి ఎదురైతే పరిస్థితి ఇబ్బందికరంగా మారేదంటున్నారు టిడిపి నేతలు.
మిత్రులతో సంబంధాల అవసరం పెరిగింది
బీజేపీ తన మిత్రులతో సంబంధాలు మెరుగుపరచుకోవాలి. ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత ప్రయోజనం చేకూరుతుందని అనుకుంటున్నామని టిడిపి నేతలు అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు.
లాభమే అంటున్న టిడిపి నేతలు
గుజరాత్ ఎన్నికల ఫలితాలు దీర్ఘకాలంలో రాజకీయంగా తమకు ప్రయోజనాన్ని కల్గించే అవకాశాలు లేకపోలేదని కొందరు టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హమీలను కేంద్రం అమలు చేసే దిశగా ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.మిత్రపక్షాల అవసరాన్ని బిజెపి గుర్తించే అవకాశం ఉంటుందని టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.