టిడిపి కేంద్ర కార్యాలయంమంగళగిరి...జనవరికల్లా రెడీ!
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని పరిధిలో మంగళగిరి వద్ద నిర్మాణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం 2019 జనవరి నాటికి సిద్ధం కావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జాతీయ పార్టీగా అవతరించిన టిడిపి కి ఇది కేంద్ర కార్యాలయంగా పనిచేయనుంది.
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి అతి సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారి వెంబడి ఉన్న హ్యాపీ రిసార్ట్స్ కు ఎదురుగా సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆఫీసు ను నిర్మిస్తున్నారు. పైగా ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఓ రెండు భారీ గేటెడ్ కమ్యూనిటీల మధ్య ఈ కేంద్ర కార్యాలయం రూపుదిద్దుకుంటుండటం విశేషం. 2017 నవంబరు 26 తేదీన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
నిజానికి ఈ సెంట్రల్ ఆఫీసును 2018 డిసెంబరు నాటి కల్లా పూర్తిచేయాలని టిడిపి వర్గాలు పట్టుదలతో ప్రయత్నించాయి. అయినా వివిధ కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది. దీంతో కనీసం జనవరి కన్నా పనులు పూర్తి చేస్తే 2019 నూతన సంవత్సరం ఆరంభంలోనైనా ఈ కార్యాలయం ప్రారంభించాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం టిడిపి కేంద్ర కార్యాలయం తాత్కాలికంగా గుంటూరులో ఒకనాటి జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం 3.60 ఎకరాల విస్తీర్ణంలో 2 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. పరిపాలనా భవనం జీ+4 మొత్తం 5 అంతస్తులతో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఒక బ్లాకును అడ్మినిస్ట్రేటివ్ బ్లాకుగా పరిగణిస్తున్నారు. రెండో బ్లాకును సమావేశ మందిరాలు, డార్మెటరీలకు కేటాయిస్తారు.
ప్రస్తుతానికి ఈ భవనాలను పార్కింగ్తోపాటు రెండంతస్తులుగా నిర్మిస్తున్నట్టు సమాచారం. ఐదో అంతస్తులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి కార్యాలయాలు, 4వ అంతస్తులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలుంటాయని తెలిసింది. బహుశా ఇది ఉగాది నాటికి ప్రారంభోత్సవం జరుపుకోవచ్చని, అలాగైనా అప్పటికి అత్యంత సమీపంలో ఉండే సార్వత్రిక ఎన్నికలకు ఇది అందుబాటులోకి రావడం ప్రయోజనకరమేనని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.