చంద్రబాబు చేతికి మరో అస్త్రం - 2019 మద్దతు కోల్పోయినా నేడు : జగన్ ఏం చేయబోతున్నారు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి మరో అస్త్రం అందిందా. వైసీపీ అందించిందా. 2019 ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ కంటే వైసీపీకి మద్దతుగా నిలిచారు. తాను అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్... సీపీఎస్ రద్దు హామీలతో వారంతా వైసీపీకి అండగా నిలిచారు. జగన్ సైతం తాను ఇచ్చిన హామీకి అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే..తొలి సారి సచివాలయంలో అడుగు పెడుతూనే 27 శాతం ఐఆర్ ప్రకటించారు. కానీ, పీఆర్సీ అమలులో మాత్రం ఉద్యోగ సంఘాలు - ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చింది.
సీఎంతో చర్చల సమయంలో
సీఎంతో జరిగిన చర్చల్లో అంతా ఓకే అయింది. హెచ్ఆర్ఏ అమలు విషయంలో కేంద్ర నిబంధనలు పాటిస్తూ ఏపీలో అమలు దిశగా ఉత్తర్వులు ఇవ్వటం తో ఒక్కసారిగా ఉద్యోగులు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే పోరు బాట ప్రారంభించారు. రివర్స్ పీఆర్సీ అంటూ ఉద్యోగ సంఘాలు... జీతాలు తగ్గుతాయనేది అతస్య ప్రచారమంటూ ప్రభుత్వం వాదిస్తున్నాయి.
అయితే, పెండింగ్ డిఏలు.. 23 శాతం ఫిట్ మెంట్ తో కలిపితే జీతం తగ్గదనేది ప్రభుత్వ వాదన. డీఏలతో కలిపి ఎలా చెబుతారంటూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదం సమయంలోనే కేబినెట్ లోనూ అధికారికంగా పీఆర్సీకి ఆమోద ముద్ర వేసారు. ఉద్యోగులకు బుజ్జగించేందుకు సీఎం జగన్ సీనియర్ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసారు.
హెచ్ఆర్ఏ తగ్గింపు అసలు వివాదం
హెచ్ఆర్ఏ పెంచితే పథకాల అమలు పైన ప్రభావం పడుతుందనేది వైసీపీ ముఖ్యుల అభిప్రాయం. ఇక, జగన్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు సిద్దంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా.. కేబినెట్ లో పీఆర్సీకి ఆమోదం.. ఇటు ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలనే నిర్ణయంతో వెంటనే రంగంలోకి దిగారు.
వేతన సవరణ విషయంలో ఉద్యోగులను జగన్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. ఉద్యోగులు తమకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. జీతాలు పెంచాలని అడిగితే తగ్గించింది ఒక్క వైసీపీ సర్కారు మాత్రమేనని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన పీఆర్సీని ప్రస్తావిస్తున్నారు.
చంద్రబాబు మద్దతు... రాజకీయంగానూ
2019లో తమకు ఉద్యోగులు మెజార్టీ స్థాయిలో వ్యతిరేకంగా ఓట్ చేసారని ఫలితాల సరళితో టీడీపీ నేతలు అంచనాకు వచ్చారు. అయితే, ఇప్పుడు వారికి దగ్గరయ్యేందుకు ఈ సమయం సరైనదిగా టీడీపీ భావిస్తోంది. దీంతో..జిల్లా స్థాయిల్లోనూ పలువురు నేతలు ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తున్నారు.
వారి పోరాటానికి అండగా ఉంటామంటూ హామీ ఇస్తున్నారు. ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ ఉద్యోగుల కోసం ఢిల్లీలో ఒక రోజు దీక్ష చేసారు. ఉద్యోగ సంఘాలను ఒప్పించటానికి వీలుగా ఏర్పాటు చేసిన మంత్రులతో కమిటీతో చర్చల విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ అభిప్రాయం అధికారికంగా ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంది. అదే విధంగా 24న సమ్మె నోటీసు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
Recommended Video
సీఎం జగన్ ఏం చేయబోతున్నారు
వీటి పైన రానున్న రెండు రోజులు కీలకంగా మారనున్నాయి. ఆ తరువాత చోటుచేసుకుంటున్న పరిణామాల ఆధారంగా తమ మద్దతు.. కార్యాచరణ ప్రకటించాలనేది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. మరి.. సమ్మెకు సిద్దమవుతున్న ఉద్యోగులతో మంత్రుల చర్చలు ఫలిస్తాయా.. ఉద్యోగులు సమ్మెకు దిగుతారా.. ఈ లోగా సీఎం నేరుగా వారితో చర్చలు చేస్తారా..లేక, హెచ్ఆర్ఏ విషయంలో పునరాలోచన చేస్తారా.. ఏం జరగబోతోంది... ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తంగా ఉద్యోగుల పీఆర్సీ చుట్టూ తిరుగుతున్నాయి. రానున్న రెండు రోజులు మరింత ఆసక్తి కరంగా మారనున్నాయి.