తప్పుడు లెక్కలతో టిడిపి మోసం:కన్నా;బిజెపి నేతలకు ఇదే సవాల్:సిపిఐ
విజయవాడ: నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం ఏపీకి ఎంతో సాయం చేసినా టిడిపి ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం విజయవాడలో కన్నా అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ టిడిపి తమకున్న బలమైన ప్రచార సాధనాలతో బీజేపీని దోషిగా చూపిందని ఆరోపించారు. జనసేన, వైసీపీని బీజేపీయే నడిపిస్తోందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. మరోవైపు ప్రత్యేక హోదా సాధనా సమితి సమావేశంలో సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ నాయకులు 85 శాతం విభజన హామీలు అమలు చేశామని అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో...భవిష్యత్ కార్యాచరణ
రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించేందుకు ఎపి బిజెపి ముఖ్య నేతలు విజయవాడలో సమావేశం అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక ఇదే తొలి సమావేశం కావడం గమనార్హం. ఈ సమావేశానికి పురందేశ్వరి, హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు, సోము వీర్రాజు, సతీష్ వంటి పలు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎపికి సంబంధించిన వివిధ రాజకీయ అంశాలు,పరిణామాలు చర్చించి రాష్ట్రంలో అవలంభించాల్సిన భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
టిడిపిపై...కన్నా ధ్వజం
ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందరినీ...అన్ని కులాలను మోసం చేశారని ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ నేతలు ప్రధాని మోడీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. టీడీపీ దుష్ప్రచారాన్ని, బాబు మోసాలను ప్రజలకు వివరిస్తామని కన్నా ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ, పోలీసు రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
రాష్ట్రంలో...భవిష్యత్ కార్యాచరణ
రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమావేశంలో చర్చించి... భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ, పోలీసు రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ... అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కన్నా ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక ఇదే తొలి సమావేశం. ఈ సమావేశానికి పురందేశ్వరి, హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు, సోము వీర్రాజు, సతీష్జీ తదితరులు హాజరయ్యారు.
మరోవైపు...సిపిఐ ఫైర్
మరోవైపు ప్రత్యేక హోదా ఉద్యమ సాధన సమితి ఆదివారం విజయవాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ నాయకులు 85 శాతం విభజన హామీలు అమలు చేశామని చెబుతున్నారని, ఇది అవాస్తవమని ధ్వజమెత్తారు. తాము రాజకీయ లబ్దికోసం కేంద్రాన్ని, మోడీని విమర్శిస్తున్నట్లుగా భాజపా నేతలు ప్రచారం చేసుకుంటున్నారని...ఇది కూడా అవాస్తవమేనన్నారు. కేంద్రం విభజన హామీలు ఏమేమి నెరవేర్చిందో ఆ పార్టీ నాయకులు చెప్పాలని రామకృష్ణ ఈ సందర్భంగా చాలెంజ్ చేశారు.
రాష్ట్ర విభజన బిల్లు...ఒక్కటి కూడా చేయలేదు
రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పొందుపరిచిన అంశాలలో కూడా ఏ ఒక్కటి బిజెపి సంపూర్ణంగా నెరవేర్చలేదని రామకృష్ణ స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని చెప్పి...కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. రూ. 350 కోట్లు ఇచ్చి కేంద్రం మళ్లీ వెనక్కి తీసుకుందని...ఇది నిజమన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారని, ఇంత వరకు అక్కడ ఎలాంటి కార్యక్రమం జరగలేదని ఆయన అన్నారు. రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని రామకృష్ణ ప్రశ్నించారు. పోర్టు, విద్యా, వైద్య కార్యక్రమాలకు రూ. 11,770కోట్లు అవసరమైతే రూ. 620 కోట్లు ఇచ్చారని, కనీసం 10 శాతం నిధులు ఇవ్వకుండా ఏ రకంగా విభజన హామీలు నెరవేర్చామని బిజెపి నేతలు చెబుతున్నారని రామకృష్ణ నిలదీశారు. మోడీ ప్రభుత్వం నియంతృత్వ పద్ధతిలో పోతుందని, నిరంకుశంగా వ్యవహరిస్తోందని రామకృష్ణ మండిపడ్డారు.